ఓడిపోతే ఎంత మార్పొస్తుందో… టిడిపికి దేవినేని అవినాష్ రాజీనామా

అమరావతి: ఎన్నికల్లో గెలుపు ఓటములు రాజకీయనాయకులను సైకాలజీని మార్చేస్తాయి.గెలిస్తే ఒక లాగా ఉంటారు, ఓడితే ఇంకొక లాగా ఉంటారు. చాాలా మంది నాయకులు ఎన్నికలయిపోగానే అధికార పార్టీలోవెళ్లేందుకు దారులు వెదుక్కుంటారు. గెలిచినా ప్రతిపక్షంలో కూర్చోలేక నియోజకవర్గం అభివృద్ధి అంటూ రూలింగ్ పార్టీలోకి ఫిరాయించడం జరుగుతూంటుంది. దేవినేని కుటుంబం మొదటి జాబితాకు వస్తుంది. 2014, 2019 ఎన్నికల ఫలితాలు ఆకుటుంబ రాజకీయాలను పూర్తిగా మార్చేశాయి.  దీనిఫలితాంగా ఎన్నికల్లో ఓడిపోయినపుడల్లా వాళ్లు పార్టీ మారారు. ఇపుడుదే జరగుతూ ఉంది. దేవినేని అవినాష్ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి.
అంతా అనుకున్నట్లే  తెలుగు యువత అధ్యక్షుని పదవికి,పార్టీ సభ్యత్వానికి  దేవినేని అవినాష్ రాజీనామా చేశాడు. టీడీపీ రాష్ట్ర కార్యాలయనికి రాజీనామా లేఖను పంపించాడు. ఇక వైసిపిలో చేరడమే తరువాయి.
2015 సెప్టెంబర్ లో  ఆయన తండ్రి దేవినేని నెహ్రూ తో కలసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయాక నెహ్రూకు కాంగ్రెస్  ఇక లాభం లేదనిపించింది.   టిడిపి అధికారంలోకి వచ్చింది కాబట్టి అది ఆకర్షణీయంగా కనిపిచింది. ఆరోజుల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోయినా మంచి వూపులో ఉన్న పార్టీ. అయినా సరే  ఆయనకు వైసిపి చేరదగ్గర పార్టీ  అనిపించలేదు. పచ్చపచ్చగా ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరారు.
టిడిపియే తనని నాయకుడిని చేసిందని, అందువల్ల టిడిపిలోకి రావడం సొంత ఇంటికి వచ్చినట్టుందని ప్రకటించారు. అయితే, 2017 ఏప్రిల్ నెహ్రూ  చనిపోయారు. అవినాష్ పార్టీలో టిడిపిలో కొనసాగారు. నారాలోకేశ్ తో టీమ్ కట్టారు. అంతా లోకేశ్ తన బ్యాచొకటి తయారు చేసుకుంటున్నారని అనుకున్నారు. అవినాశ్ కూడా టిడిపి గురించి లోకేశ్ నాయకత్వం గురించి చాలా చాలా  గొప్పగా గొప్పగా మాట్లాడారు.
2019 ఎన్నికల్లో  అవినాష్ గుడివాడ నుంచి పోటీ చేసి కొడాలి నాని(89833 వోట్లు)చేతిలో వోడిపోయారు.అవినాష్ కు 70354 వోట్లు వచ్చాయి. ఈ ఓటమి ఆయన ఆలోచనా ధోరణిని మార్చేసింది. తెలుగుదేశంలో ఉండిసాధించేేదేమీ లేదనిఅనిపించింది.  2014 ఎన్నికల తర్వాత వాళ్ల నాన్న ఏంచేశాడో అవినాశ్ ఇపుడు అదే చేస్తూ టిడిపికి గుడ్ బై చెప్పారు.
ఇపుడాయన  వైసిపిలో చేరుతున్నారు.
ఇవే రాజకీయాలు. ఇది శాశ్వతమనుకోవడానికి వీల్లేదు. 2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిని బట్టి ఉంటుంది.