ఆర్టీసి బంద్ లో బొటనవేలు తుంచేసిన పోలీసులు…

ఆర్టీసీ కార్మికుల సమస్యల మీద జరుగుతున్న రాష్ట్ర బంద్ జోరుగాసాగుతూ ఉంది. సర్వత్రా నిరసనలు, అరెస్టులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ ఆర్టీసి  క్రాస్ రోడ్ లో నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐఎంఎల్ నేత పోటు రంగారావు చేతి బొటనవేలు తెగి పోయింది

నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వారిని అరెస్టు చేశారు. పోలీసులు  వారిని వ్యాన్ లో ఎక్కించే క్రమంలో రెండు తలుపుల మధ్య సిపిఐ ఎంఎల్ నేత వేలును  పెట్టి నొక్కి కట్ చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. కావాలనే పోలీసులు అలా చేశారని ఆయన చెపుతున్నారు.

‘నన్ను కేసీఆర్ చంపమన్నాడా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు, ఇప్పుడు కార్మికుల పక్షాన నిలబడి పోరాడినందుకు ఇది నాకు బహుమనమా,’ అని రంగారావు  పోలీసులను ప్రశ్నించాడు.

సిపిఐ నేతల అరెస్టులు

సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా, ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ప్రెసిడెంట్ మారుపాక అనిల్ కుమార్ లను పోలీసులు అరెస్ట్ చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.

ఆఫీస్ నుండి బయటకు వెళ్తున్న మమ్మల్ని అరెస్ట్ చేయడం అన్యాయని చాడ వెంకటరెడ్డి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వ్యాఖ్యానించారు.

బిజెపి నాయకుల అరెస్ట్……

ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా జెఏసి పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ సందర్భంగా బిజెపి యాకుత్ పురా కన్వీనర్ నిరంజన్ యాదవ్,కూర్మగుడా అధ్యక్షులు వెంకటరెడ్డి లను అరెస్టు చేశారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ అరెస్ట్ ను కండిస్తూ ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఉద్యమం పట్ల కేసీఆర్ దమన కాండను ప్రజాస్వామ్యవాదులు గ్రహించాలని అన్నారు.

కేసీఆర్ నియంతలా కాకుండా ప్రజాస్వామ్య పద్దతిలో పరిపాలన చేయాలి, లేకుంటే ఇదే తెలంగాణలో మరో ఉద్యమం తప్పదని వారు అన్నారు.

బంద్ సంపూర్ణం:అశ్వత్థామ రెడ్డి

బంద్ సంపూర్ణంగా జరిగిందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. బంద్ కు మద్దతిచ్చిన అన్ని వర్గాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని ఆయన ఖండించారు.

అరెస్ట్ చేసే క్రమంలో భౌతిక దాడులకు పాల్పడటం సరికాదని , అరెస్ట్ చేసిన వారందరినీ భేషరతుగా విడుదల చేయాలని అయన డిమాండ్ చేశారు.

సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.