కరోనా చికిత్స కాస్ట్లీ, అవాక్కయిన సుప్రీంకోర్టు, ఫీజు తగ్గే మార్గమేది?

కరోనా పాండెమిక్ పరిస్థితిని, ప్రజల్లో ఉన్న ఆందోళనను ప్రయివేటు ఆసుపత్రులు, కరోనా టెస్ట్ జరిపేందుకు లైసెన్స్ ఉన్న ల్యాబోరేటరీలు సొమ్ముచేసుకోవాలనుకుంటున్నాయి. కరోనా వైద్యం ధర ఇంతవరకు ఎవరూ నిర్ణయించలేదు. దానితో కార్పొరేట్ వైద్యశాలలు ఇష్టానుసారం బిల్లులు వేస్తున్నాయి. కొన్ని ఆసుప్రతులలోచికిత్సధర ప్రభుత్వం ఆసుపత్రులు వసూలు చేస్తున్నదానికంటే కనీసం పదింతలు ఎక్కువగా ఉంది. ఇక పరీక్షల సంగతి వేరే చెప్పనవరమేలేదు.
హైదరాబాద్ కోవిడ్ పరీక్షలు మంచి బిజినెస్ గామారింది. గుర్తించబడిన డయాగ్నోష్టిక్ సెంటర్లు రు. 5100 దాకా వసూలు చేస్తున్నాయి. నిజానికి ఐసిఎం ఆర్  రు. 4500 లుగా ధర నిర్ణయించింది. అయితే, ఇదే చాలా ఎక్కువ అని  చాలా రాష్ట్రాలకు చాలా తక్కువ ధరలు నిర్ణయించాయి. నిజానికి కర్నాటక ప్రభుత్వం అక్కడ టెస్ట్ ధరని రు. 2500 నిర్ణయించింది. అయితే, హైదరాబాద్ లో ప్రభుత్వం అదుపులేకపోవడంతో ధర రు. 5000 దాటింది. అయితే, కరోనా అనుమానం రాగానే ఇంటిల్లి పాదేకాకుండా ఇరుగుపొరుగు కూడా  ఆందోళన చెందుతారుకాబట్టి, ముందు టెస్టు చేయించుకుని హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకోవాలనుకుంటున్నారు. దీనితో ఎలాంటి రోగ లక్షణాలు లేకపోయినా అనుమానం వస్తే చాలు టెస్టులకు పరిగెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం  మాత్రం  రోగలక్షణాలు లేకపోతే, పరీక్షలు చేయడం మానేసింది. అంతెందుకు తమకు పరీక్షలుచేయడం లేదని  ఉస్మానియా మెడికోలే  గగ్గోలు పెడుతున్నారు.

https://trendingtelugunews.com/english/features/coronavirus-test-rt-pcr-cost-will-haunt-people-post-lockdown/

ఈ కరోనా వైద్యం ఖర్చుభరించలేనంతగా ఉంది, ప్రభుత్వాలు దీని మీద దృష్టిపెట్టలేదు, మీరైనా జోక్యం చేసుకోండని ఒక విజ్ఞప్తి సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది.
ఈ పిటిషన్ వేసిన వ్యక్తి  అవిషేక్ గోయంకా. ప్రయివేటు ఆసుపత్రులన్నీ పాండెమిక్ పరిస్థితుల్లో ప్రజలను దోచుకోవాలనుకుంటున్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వైద్యం ఖరీదయి, ప్రజల మీద భారం కాకుండా ఉండదుకు ప్రయివేటు ఆసుప్రతుల చికిత్స ధర నిర్ణయించాలని ప్రభుత్వాలను ఆదేశించండని ఆయన  కోర్టును కోరారు.
  జస్టిస్ లు అశోక్ భూషణ్,, ఎం ఆర్ షా, వి రామసుబ్రమణియన్ ల డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ విచారిస్తున్నది.
ఇదే విధంగా మరొక న్యాయవాది సచిన్ జైన్ కూడా ప్రయివేటు ఆసుపత్రులు వసూలు చేస్తున్న చార్జి మీద పరిమితి విధించాలని పిటిషన్ వేశారు. ఇదిప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఎ బాబ్డే, న్యాయమూర్తులు, ఎ ఎస్ బాపన్న, రిషీ కేశ్ రాయ్ పరిశీలనకు వచ్చింది. ప్రభుత్వం నుంచి ఉచితంగా భూములు, ఇతర రాయితీలు తీసుకున్న చారిటబుల్ ఆసుపత్రులు కొంతమంది రోగులకు ఉచితంగా చికిత్స చేయకూడదని ఈ ధర్మాసనం ప్రశ్నించింది. రోగులకు ఉచితంగా చికిత్స చేయాలనిప్రయివేటు ఆసుపత్రులకు సూచనలిచ్చే చటాలేవీ లేని కేంద్రం దీనికి సమాధానమిచ్చింది.
ఇతర పిటిషనర్ల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే,ముకుల్ రోహత్గీ  కూడా చారిటబుల్ ఆసుపత్రులలో ఇప్పటికే  కొంత శాతం మందికి ఉచితంగా చికిత్సచేయాలని నియమం విధించిన విషయాన్ని కోర్టుకు తెలిపారు. రోహత్గీఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ పరిస్థితి వివరిస్తూ ఈ ఆసుపత్రిని పూర్తి కోవిడ్ ఆసుపత్రిగా మార్చారని, దీనితో ఇతర రోగులల రాక  70 నుంచి 80 శాతం పడిపోయి ఆసుపత్రికి రాబడి పడిపోయిందని కోర్టుకు గుర్తు చేశారు. ఇలా ప్రయివేటు ఆసుప్రతులకు రాబడి లేక మూత పడే పరిస్థితి వచ్చందని చెప్పారు.
ఇపుడు అవినాష్ గోయంకా పిటిషన్ విచారిస్తున్న బెంచ్ స్పందిస్తూ కోవిడ్-19 చికిత్సధర మీద గరిష్టపరిమితి విధిస్తూ ప్రభుత్వమేదయినా ఉత్తర్వు ఇవ్వగలదా అని కేంద్రాన్ని అడిగింది. గరిష్ట పరిమితి విధించేందుకు వీలయ్యే ఆరోగ్య పథకమేదాయినా ఉందేమో కేంద్రాన్ని సంప్రదించాలని బెంచ్ సాలిసిట్ జనరల్ తుషార్ మెహతాను కోరింది.
మొత్తానికి కోవిడ్-19 కంటే ఆసుపత్రి చికిత్స బిల్లు ప్రజలను వణికించే పరిస్థతి వస్తున్నదనేందుకు సుప్రీంకోర్టుకు వచ్చిన పిటిషన్లే సాక్ష్యం.