వచ్చే రెండు వారాలు చాలా కీలకం: కేంద్రం

అమరావతి, ఏప్రిల్ 5: కరోనా వైరస్ మహమ్మారిని జయించేందుకు రానున్న రెండు వారాలు అత్యంత కీలకమని కావున అన్ని రాష్ట్రాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ చెప్పారు.
కోవిద్-19 కేసులు అధికంగా నమోదు అవుతున్న జిల్లాల కలక్టర్లు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వైరస్ వ్యాప్తి నియంత్రణకు అనుసరించాల్సిన కంటైన్మెంట్ విధానం పై ఓరియంటేషన్ కమ్ ట్రైనింగ్ సెషన్ ను ఆదివారం ఆయన ఢిల్లీ నుండి వీడియో సమావేశం ద్వారా నిర్వహించారు.ఈ సందర్భంగా కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ మాట్లాడుతూ లాక్ డౌన్ నేపధ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలు పనిచేసేలా చూడాలని సిఎస్ లకు సూచించారు.ఆహారం,మందులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.లాక్ డౌన్,కంటైన్మెంట్ విధానాలను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.అదే విధంగా ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించేలా చూడాలని చెప్పారు.లాక్ డౌన్ ఆనేది మనకు లభించిన అద్భుత అవకాశమని దీనిని కట్టుదిట్టం గా అమలు చేయడం ద్వారా కరోనా మహమ్మారిని దేశం నుండి తరిమి గొడదామని ఆయన పిలుపునిచ్చారు.
జిల్లాల్లో ర్యాఫిడ్ రెస్పాన్స్ బృందాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని సిఎస్ లను, కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్రాలు, జిల్లాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని వనరులను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని అవసరమైన సమయంలో అవసరమైన ప్రాంతాల్లో సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పారు.
 హైరిస్క్ ఉన్నవారంతా విధిగా క్వారంటైన్ కేంద్రాలు లేదా ఐసోలేషన్లోను ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాజీవ్ గౌబ స్పష్టం చేశారు.ఇప్పటి వరుకూ విజయవంతం గా లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నందుకు రాష్ట్ర,జిల్లా యంత్రాంగాలను కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ప్రత్యేకంగా అభినందించారు.
ఈవీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర,వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కె.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.