ఏజి ప్రెస్ మీట్ పెట్టడమేంటి, విడ్డూరం కాదూ? అది కోర్టు ధిక్కరణ :యనమల

 రాష్ట్ర ప్రభుత్వం న్యాయసలహాదారు అయిన అడ్వొకేట్ జనరల్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం పట్ల మాజీ మంత్రి, తెలుగుదేశం నేత, శాసనసమండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.
ఏజి ప్రెస్ మీట్ పెట్టి హైకోర్టు తీర్పు ఏజి నే ఇంటర్ ప్రెట్ చేయడమనేది నాజీవితంలో ఎపుడూ చూడలేదని ఆయన అన్నారు.
హైకోర్టు తీర్పును వక్రీకరిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం  కోర్టు ధిక్కరణ అవుతుందని ఇప్పటికే కోర్టు ధిక్కరణ కేసులో కోర్టుకు హాజరైన అధికారిని పక్కన పెట్టుకుని ఏజి మళ్లీ కోర్టు ధిక్కరణకు పాల్పడతారా అని ఆయన ప్రశ్నించారు.
ఇంకా యనమల ఏమన్నారంటే…
40ఏళ్ల నా అనుభవంలో న్యాయనిపుణుడు(ఏజి) హైకోర్టు తీర్పుపై ప్రెస్ మీట్ పెట్టడం చూల్లేదు. న్యాయవాదిగా, రాజకీయ నేతగా ఇలాంటి పరిస్థితి నాకెపుడూ ఎదురు కాలేదు.
హైకోర్టు తీర్పు ఇచ్చాక తీర్పుపై అపీల్ చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. అందులో వాళ్ల వాదన వినిపించవచ్చు. దానికి భిన్నంగా ఏజి మీడియాతో మాట్లాడటమేమిటి?
సీఎంవో కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను, పంచాయితీరాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని చెరోవైపు పెట్టుకుని ఏజి ప్రెస్ మీట్ పెట్టడం అభ్యంతరకరం.
తన దురుద్దేశాలను ఏజి ద్వారా చెప్పించాలనే తాపత్రయం ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది.

https://trendingtelugunews.com/telugu/breaking/state-takes-objection-to-nimmagadda-ramesh-kumars-taking-charge-sec-chief/

 తీర్పులు మీద  ప్రెస్ మీట్లు పెట్టడం, మీడియా ముందుకు రావడం ఏజి విధి నిర్వహణలో భాగాలు కాదు.  ఏజి ప్రెస్ మీట్ పెట్టడం మరో దుస్సంప్రదాయం. ఇప్పటికే గత ఏడాదిగా రాష్ట్రంలో అనేక దుస్సంప్రదాయాలు చూశాం. ఈ విధంగా మరో దుస్సంప్రదాయానికి ఏజి నాంది పలకడం దురదృష్టకరం.
హైకోర్టు తీర్పులో పేర్కొన్న ‘‘స్టాండ్ రెస్టోర్డ్’’ అనే పదాన్ని ప్రస్తావిస్తూనే, దానికి ఏజి వక్రభాష్యాలు చెప్పడం దారుణం.
ఆర్టికల్ 213(కె) 1 ప్రకారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని నియమించేది గవర్నర్. అలాంటిది ఆర్డినెన్స్ ద్వారా కొత్త ఎస్ ఈసిని నియమించడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. గవర్నర్ ఇచ్చిన ఆర్డినెన్స్ 5 ను హైకోర్టు రద్దు చేసింది. సబ్ సీక్వెంట్ జీవో(617,618,619)లను కూడా రద్దు చేసింది. కొత్త ఎన్నికల ప్రధానాధికారి నియామకం జీవో కూడా(619) రద్దు అయ్యింది.
ఆర్డినెన్స్ 5 రద్దైన తక్షణం నుంచే ఎస్ ఈసిగా రమేష్ కుమార్ విధుల్లోకి వచ్చినట్లు..అలాంటిది దానిని వక్రీకరించడం ద్వారా ఏజి ‘‘తిమ్మిని బిమ్మి చేయాలని’’ ప్రయత్నిస్తున్నారు.
‘‘స్టాండ్ రెస్టోర్డ్’’ అంటే ‘‘ఆటోమేటిక్ రెస్టోరేషన్..’’
ఇవన్నీ అటార్నీ జనరల్ గారికి తెలియనివి కావు. అయినా మీడియా ముందు వక్రీకరణలు భావ్యం కాదు. ఇద్దరు ప్రభుత్వ అధికారులను చెరోవైపు పెట్టుకుని ప్రెస్ మీట్ ఎలా పెడతారు..?  ఈసికి సహకరించవద్దని ప్రభుత్వం ఎలా చెబుతుంది..?
న్యాయనిపుణులు మీడియా ముందుకు రారు అంటూనే ప్రెస్ మీట్ పెట్టడం రాజకీయ ప్రేరేపితమే. అదృశ్యశక్తుల ప్రోద్భలం మేరకే ప్రభుత్వ అధికారులతో కలిసి ఏజి ప్రెస్ మీట్ పెట్టారు.
హైకోర్టు తీర్పును పురస్కరించుకుని రమేష్ కుమార్ బాధ్యతలు చేపడితే, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తే, వాటిని మేము ఖాతరు చేయమని ఏజి చెప్పడం కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లే..
ఇటువంటి పోకడలు ప్రజాస్వామ్యానికి చేటుదాయకం. గతంలో చేసిన తప్పిదాలను చక్కదిద్దుకునే అవకాశం ఇది.. దానిని చేతులారా కాలరాయడం మంచిది కాదు.