అది ఎన్నికల కమిషనా, బిజెపి ఆఫీసా…?

భారతదేశంలో ఎన్నికల కమిషన్ బిజేపి కమిషన్ గా మారిపోయిందని తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న  తీవ్రమైన ఆరోపణ చేశారు. ఈరోజు అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ ఒక పుడు ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తితో నిబంధనల మేరకు వ్యవహరించేదని, అధికారంలో ఎవరు ఉన్నా పార్టీలతో సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహించేదని అన్నారు.

ఇపుడు బిజెపి ఉత్తర్వుల మీద పని చేస్తూ ఉందని ఆయన ఆరోపించారు.

రీ పోలింగ్ కోసం మేము రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిస్తే స్పందించలేదని, అనేక నేరాలలో  ఎ2 ముద్దాయి గా ఉన్న వైసిపి నేత  విజయసాయి రెడ్డి డిల్లీలో ప్రధాని కార్యాలయం ద్వారా ఎన్నికల సంఘాన్ని నడిపిస్తున్నారని వెంకన్న ఆరోపించారు.

విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెల్ల కాగితం మీద ఫిర్యాదు ఇస్తే ఎన్నికల సంఘం వెంటనే స్పందిస్తున్నదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

చంద్రగిరిలో ఓటమి భయంతో వైసిపి పిఎంఒ ద్వారా ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయించారని చెబుతూ  పోలింగ్ జరిగిన నలభై రోజుల తర్వాత రీపోలింగ్ నిర్వహించడం దేశ చరిత్రలో తొలిసారని ఆయన అన్నారు.

బిజేపి యేతర పార్టీలను ఏదో విధంగా ఓడించాలని మోడి అనేక కుట్రలు చేస్తున్నారని, ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ  సియస్ యల్వీ సుబ్రహ్మణ్యం , సిఇవొ ద్వివేదీ లు పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఐదు కేంద్రాలలో రీపోలింగ్ కు ఆదేశించారని ఆయన వ్యాఖ్యానించారు.

‘మేము 19 చోట్ల రీపోలింగ్ పెట్టాలని మేము అడిగితే ఇంతవరకు స్పందించలేదు. ఎన్ని కుట్రలు చేసైనా, డబ్బు పంచైనా ఆ ఐదు కేంద్రాలలో తమకు అనుకూలంగా మలచుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. యల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలతో రీపోలింగ్ చేస్తున్నామని చెప్పడం సిగ్గుచేటు. మోడి తన అధికారాన్ని ఉపయోగించి ఎపి లో అనేక కుట్రలు చేస్తున్నారు. మోడి అనే మహిసురుడి పాలన మే 23 తర్వాత రాజకీయం గా అంతం అవడం ఖాయం. చంద్రబాబు బిజేపి నుంచి బయటకు రాగానే మోడి పతనం ప్రారంభమైంది.చంద్రబాబు తెలుగు ప్రజల బ్రహ్మాస్త్రం లాంటి వాడు.మోడి మోసాలను వెలుగులోకి తెచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు,’ అని ఆయన అన్నారు.

సియస్ సుబ్రహ్మణ్యం ఇప్పటికైనా స్పందించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని, తాము కోరిన విధంగా 19 చోట్ల కూడా రీపోలింగ్ చేపట్టాలని ఆయన  డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *