కేసిఆర్ సర్కారుకు సొంత యూనియన్ ఆర్టీసి వర్కర్స్ ఝలక్

తెలంగాణలో ఆర్టీసి కార్మికులు కేసిఆర్ సర్కారుపై కన్నెర్రజేశారు. తెలంగాణలో గుర్తింపు పొందిన ఆర్టీసి కార్మిక సంఘం టిఎంయు ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి సర్కారుకు గట్టి హెచ్చరికలు పంపారు. సోమవారం హైదరాబాద్ లో జరిగిన టిఎంయు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాటల్లోనే చదవండి.

ఆర్టీసి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయి. ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రులు గా ఉన్నారంటే అది తెలంగాణ ఆర్టీసి కార్మికుల చలువే. సర్కారు దయా దాక్షిణ్యాల మీద ఆర్టీసీ కార్మికులు లేరని గుర్తు పెట్టుకోవాలి. మీ అవసరం మాకెంత ఉందొ.. మా అవసరం మీకు అంతే ఉంటుంది. చీటికీ మాటికి కార్మికులు, ఉద్యోగుల మీద కేసులు పెడితే చూస్తూ ఊరుకోం.

డిపో నష్టాల్లో ఉంటే మేనేజర్లకు మెమోలు ఇవ్వాలి.. జోన్ నష్టాల్లో ఉంటే ఇడి, ఎండిలకు మెమోలు ఇవ్వాలి… యాజమాన్యం దీనికి సిద్ధంగా ఉందా? అప్పుడే మాకూ నోటీసులు ఇవ్వండి. తెలంగాణ ఫలాలు ఆర్టీసీ కార్మికులకు అందలేదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తాము కోరితే బోర్డు లేదంటున్నారు. మరి ఈడీ ప్రమోషన్, బోర్డు చైర్మన్ పోస్టును ఎలా నింపారు. తమకు డైరెక్టర్ పోస్టులు కూడా అవసరం లేదు.

ఉద్యమకారుడు సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఉద్యమకారుల మీటింగ్ కు ఎందుకు అనుమతి దొరకడం లేదు? కార్మిక, ఉద్యోగులకు ఆర్టీసీలో ఎందుకు ఉద్యోగ భద్రత లేదు? జిహెచ్ఎంసీ నుంచి ఆర్టీసికి రావాల్సిన నిధులు ఎందుకు విడుదల చేయడంలేదు.

ఇతర కార్మిక సంఘాలు కూడా ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం కలిసి రావాలి. ఈ ధర్నా హెచ్చరిక మాత్రమే. ప్రగతి భవన్ ముట్టడించే వరకు రావొద్దని మేం కోరుకుంటున్నాం. ఈ నెల 21 తరువాత ఎప్పుడైనా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతారు. సమావేశంలో యూనియన్ నేతలు థామస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *