యాదాద్రి గుడి నిర్మాణంపై కేసీఆర్ విజన్ ఇదే

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, అద్భుత ఆలయ శిల్ప కళా నైపుణ్యంతో, ఆలయ ప్రాశస్త్యం, వైభవం ప్రస్ఫుటమయ్యేలా యాదాద్రి పునరుద్ధరణ పనులు జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. యాదాద్రిలో చేపట్టిన నిర్మాణ పనులకు నిధుల కొరత లేకుండా ఈ సారి బడ్జెట్లో కూడా అవసరమైనన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు.
పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తర్వాత సహస్ర్రాష్టక కుండయాగం (1008 యాగ కుండాలతో) 11 రోజుల పాటు మహాయాగం నిర్వహించనున్నట్లు సిఎం వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లను ఆహ్వానిస్తామని చెప్పారు. వందల ఏళ్ల పాటు నిలిచిపోయే దేవాలయం కాబట్టి, ప్రతీ అంగుళం నిర్మాణంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, వైభవోపేతంగా నిర్మాణాలుండాలని చెప్పారు. అత్యాధునికంగా, ఆధ్మాత్మిక శోభ కనిపించేలా నిర్మించిన వెల్లూరు, తంజావూరు, అక్షరధామ్ లాంటి ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించి నిర్మాణాలను అధ్యయనం చేయాలని సిఎం అధికారులను కోరారు. దేశంలోని ప్రతీ ఒక్కరు ఒక్కసారైనా యాదాద్రిని సందర్శించాలనే ఉత్సుకత కలిగేలా దేవాలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని చెప్పారు. పునరుద్ధరణ తర్వాత యాదాద్రికి భక్తుల సంఖ్య ఎన్నో రెట్లు పెరుగుతుందని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సిఎం ఆదేశించారు.
శివరాత్రి ఉత్సవాలు, తెప్పోత్సవం నిర్వహించడానికి, నిరంతరం వ్రతాలు చేసుకోవడానికి, తలనీలాల సమర్పణకు, మండల దీక్ష భక్తులు ప్రత్యేక పూజలు చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు శాశ్వత ప్రాతిపదికన చేయాలని సిఎం ఆదేశించారు. ఒకదాని తర్వాత ఒకటి కాకుండా నిర్మాణ పనులన్నీ సమాంతరంగా సాగాలని, దీనికోసం ఏ పనికి ఆ పనిగా ప్రణాళిక సిద్దం చేసుకుని అమలు చేయాలని చెప్పారు.
యాదాద్రి పునరుద్ధరణ పనులను ఆదివారం సందర్శించి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, సోమవారం ప్రగతి భవన్ లో విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్ అండ్ బి ఇఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, ఇ.ఇ. వసంతర్ నాయక్, ఎస్.ఇ. లింగారెడ్డి, వైటిడిఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, ఇవో గీత, ఆలయ నిర్మాణ నిపుణుడు ఆనంద్ సాయి, స్ట్రక్చర్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, ఆర్కిటెక్ట్ మధుసూదన్, వాసుకి, వాసుకి, సిఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఆలయమున్న గుట్టపై భాగంలో ఎలాంటి నిర్మాణాలు రావాలి? గుట్ట కింద భాగంలో ఎలాంటి నిర్మాణాలు రావాలి? టెంపుల్ సిటీపై ఎలాంటి నిర్మాణాలు రావాలి? మొత్తంగా యాదాద్రి ఎలా ఉండాలి? అనే విషయాలపై చర్చించి, తుది నిర్ణయం తీసుకున్నారు. మాడవీధులు, ప్రాకారాలు కలుపుకుని 4.5 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన దేవాలయం నిర్మించాలని, మొత్తం 302 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయ ప్రాంగణం ఉంటుందని సిఎం వెల్లడించారు.
లక్ష్మీ నర్సింహస్వామి కొలువై ఉండే గుట్టపై భాగంలో ప్రధాన దేవాలయంతో పాటు గోపురాలు, ప్రాకారాలు, మాడ వీధులు, శివాలయం, ఆంజనేయ స్వామి విగ్రహం, ఇ.వో.కార్యాలయం, వివిఐపి గెస్ట్ హౌజు(ప్రెసిడెన్షియల్ సూట్), అర్చక నిలయం, నైవేధ్యం వంటశాల, ప్రసాద మంటపం, రథశాల, వ్రత మంటపం, స్వామి పుష్కరిణి, క్యూ కాంప్లెక్స్, మెట్ల దారి, బస్టాప్, పోలీస్ ఔట్ పోస్టు, హెల్త్ సెంటర్లుండాలని నిర్ణయించారు. ఏ నిర్మాణం ఎక్కడ రావాలనే దానిపై తుది నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం నిర్మాణాలు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. గుట్ట కింది భాగంలో గండి చెరువును తెప్పోత్సవం నిర్వహించడానికి అనువుగా సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పారు. బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి నిత్యం ఈ చెరువుకు నీటి సరఫరా చేస్తామని వెల్లడించారు. గండి చెరువుకు అనుబంధంగా కోనేరు, కళ్యాణకట్ట నిర్మించాలని చెప్పారు.
గుట్ట కింద భాగంలోనే ఆలయ బస్టాండ్ నిర్మించాలని, అక్కడి నుంచి భక్తులను దేవాలయ వాహనాల ద్వారా గుట్టపైకి తీసుకురావాలని చెప్పారు. గుట్టపైకి వెళ్లి, రావడానికి వేర్వేరు దారులు ఉపయోగించాలని చెప్పారు. గుట్ట కింద మండల దీక్ష చేపట్టిన భక్తుల కోసం ఆశ్రమం నిర్మించాలని నిశ్చయించారు. యాదాద్రి ఆలయం చుట్టూ రింగు రోడ్డు నిర్మించాలని, దానికి అనుబంధంగా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. యాదాద్రి నుంచి తుర్కపల్లికి నాలుగు లేన్ల రోడ్లు వేయాలని ఆదేశించారు.
నిర్మాణ పనులన్నీ అత్యంత పటిష్టంగా జరగాలని, నాణ్యత విషయంలో రాజీపడవద్దని కోరారు. పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తర్వాత పరిపూర్ణ ఉపాసకులతో అతిపెద్ద యాగం నిర్వహిస్తామని, దీనికి దేశ విదేశాల నుంచి ప్రముఖులను ఆహ్వానిస్తామని వెల్లడించారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ యాగం కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయడానికి ఓ కమిటీని నియమించనున్నట్లు చెప్పారు. భక్తులు భస చేయడానికి వీలుగా టెంపుల్ సిటీలో 340 క్వార్టర్ల నిర్మాణ పనులు వేగంగా జరగాలని చెప్పారు. టెంపుల్ సిటీలో రోడ్లు, మంచినీరు, విద్యుత్, డ్రైనేజి లాంటి కనీస వసతులు కల్పించాలని సూచించారు. యాదాద్రిలోని ప్రతీ బ్లాకుకు దేవుళ్లు, దేవతల పేర్లు పెడతామని సిఎం చెప్పారు. యాదాద్రి టెంపుల్ సిటీ అంతా ప్రకృతి రమణీయత గోచరించేలా, ఆహ్లాదం వెల్లివిరిసేలా ఉద్యానవనాలు, ఫౌంటేన్లు నిర్మించాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *