రాజ్ కపూర్ ఆఫర్స్ ను 4 సార్లు వద్దన్నహిందీ నటి తెలుగు కనెక్షన్ ఏమిటంటే?

(Chandamuri Narasimhareddy)
ఆమె అందం , అభినయం అనన్యం… నేటితరం కు అంత తెలియక పోవచ్చుఆమె… …ప్రపంచ సుందరిగా పేరు పొందిన పది మందిలో ఆమె ఒకరు. చాలా తక్కువ హిందీ,ఇంగ్లీష్ సినిమాల్లో సినిమాల్లో నటించి ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది.  మర్చంట్ ఐవరీతొలి ప్రొడక్షన్ ‘Householder’లో కూడా నటించారు. తన భావాలకు చిత్రరంగానికి  పొంతన కుదరక తప్పుకున్నారు. ఆమెది తెలుగు వారసత్వం. భారత ప్రభుత్వం 2011లో  ఆమె జ్ఞాపకంగా పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేసింది. గుర్తు తెచ్చుకోండి.   ఇలాంటి పాత తరం హీరోయిన్ ఎవరై ఉంటారు.
ఇంకొక క్లూ ఇస్తున్నాను. 1960 ఆమె తొలి హిందీ చిత్రం అనూరాధ’ వచ్చిది. ఇందులో హీరో బల్రాజ్ సహాని. ఆమె హీరోయిన్.ఈ చిత్రం ఆమె నటనని, అందాన్ని అంతర్జాతీయం చేసింది. ఈ చిత్రం కమర్షియల్ విజయవంతం కాలేదుగాని, ఉత్తం చిత్రంగా నేషనల్ అవార్డు సంపాదించింది. అందమయిన హీరోయిన్, బల్రాజ్ సహానీ హీరో, గొప్ప దర్శకుడు, పండిట్ రవిశంకర్ సంగీతంతో  హృదయాన్ని హత్తుకు పోయే విధంగా రూపొందించిన  చిత్రం ఇది.
ఇందులో పైపైకి ఎదగాలనుకుంటున్న మధ్య తరగతి అమ్మాయికి, గాంధీయన్ విలువలతో బతకాలనుకుంటున్న ఒక ఆదర్శ డాక్టర్ కి మధ్యజరిగే అంతర్మథనం దర్శకుడు  హృశీకేష్ ముఖర్జీ అద్బుతంగా చిత్రీకరించారు. ఒక సారి ఈ సినిమా చూస్తే చెరగని ముద్ర వేస్తుంది. ఇపుడయినా గుర్తొచ్చిందా ఆమె ఎవరో?
మరొక క్లూ
స్పానిష్ సర్రియలిస్టు చిత్రకారుడు సాల్వడార్ దాలి ఆమె తన మోడెల్ గా ఎంచుకున్నాడు. ఇంకా గుర్తు రాలేదా?
ఆమె పేరు లీలానాయుడు.
ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త పత్తిపాటి రామయ్య నాయుడు కుమార్తె. చిత్తూరు జిల్లా మదనపల్లెకుచెందిన  డాక్టర్ రామయ్య నాయుడు అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్త. హిందీ చిత్ర సీమకి తొలి తరంహీరోయిన్లను అందించి దక్షిణభారత దేశమే. ఇందులో లీలా నాయుడు ఒకరు. ఎందుకోగాని తెలుగు వాళ్లెపుడూ ఆమెను సొంతం చేసుకోలేదు.
డా. రామయ్య పారిస్ లో   యూనెస్కో శాస్త్ర సలహాదారుగా పనిచేస్తున్న సమయంలో ఫ్రెంచ్ దేశానికి చెందిన జర్నలిస్టు, ఇండాలజిస్టు (Indologits)  మార్తే మేంజ్ (Dr Marthe Mange) ను ఆయన వివాహం చేసుకున్నారు. తల్లిది స్విష్-ఫ్రెంచ్ కుటుంబనేపథ్యం. మరొక విషయం ఏమిటంటే, భారతకోకిల పేరున్న సరోజనీనాయుడు లీలానాయుడుకు మేనత్త. సరోజనీ నాయుడు భర్త గోవిందరాజులు నాయుడు.
లీలా నాయుడు 1940 జులై 28న జన్మించారు.
రామయ్య నాయుడు చిత్తూరు జిల్లా, మదనపల్లిలో 1904 జూన్ 3 న జన్మించాడు. చిన్న వయసులోనే ఇల్లు వదలి పుదుచ్చేరి లోని అరవిందాశ్రమములో చేరాడు. పిదప బెంగాల్ లోని శాంతినికేతన్లో గణితశాస్త్రము బోధించాడు. కాశీ లోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయములో 1923 లో పట్టభద్రుడయ్యాడు. పారిస్ విశ్వవిద్యాలయంలో 1929లో ఎం.ఎస్.సి పూర్తి చేశారు. 1933లో పరిశోధనకు పూనుకున్నారు.  అపుడు ఆయనకు సూపర్ వైజర్  ఎవరనుకుంటున్నారు, రెండు సార్లు నోబెల్ పురస్కారం పొందిన  మేరీ స్క్లోదొవ్ స్కా క్యూరీ (Marie Sklodowska Curie),కుప్తంగా మేడమ్ క్యూరీ. నిజానికి ఆయన ఇంగ్లండు వెళ్లేందుకు స్కాాలర్ షిప్ వచ్చింది.దానిని కాదని ఆయన  ఎమ్మెస్సీ చేసేందుకు పారిస్ యూనిర్శిటీ వెళ్లారు. 1929లో ఎమ్మెస్సీ పూర్తి చేశాక, మేడమ్ క్యూరీతో పని చేయాలనుకుంటున్నట్లు ఆమెకు ఒక లేఖ రాశారు. ఆమె అంగీకరించారు. క్యూరీ-కర్నెగీ ఫెలోషిప్ మంజూరయింది. క్యూరినాయకత్వంలో నడుస్తున్న రేడియం ఇన్ స్టిట్యూట్ లో ఆయన రేడియో యాక్టివ్ మూలకాల మీద పనిచేశారు.   1933 లో ఆయనకు డాక్టర్ ఆఫ్ సైన్సెస్  వచ్చింది. ఆయన తొలి రీసెర్చ్   పేపర్లు ఫ్రెంచ్ భాషలో అచ్చయ్యాయి. మేడమ్ క్యూరీ మరణం తర్వాత ఆయనే కొద్ది రోజులు క్యూరీ లాబొరేటరీ నడిపారు.
తరువాత ఇంగ్లాండుకు వెళ్ళి అక్కడ లండన్ యూనివర్సిటీ లో ఎక్స్ పెరిమెంటల్ ఫిజిసిస్టు  ప్రొఫెసర్ పిఎంఎస్  పాట్రిక్ బ్లాకెట్ పర్యవేక్షణలో పరిశోధనలు చేసి 1936లో డాక్టరేట్ పట్టా పోందాడు.
1936నుంచి డొరాబ్జీ  టాటా ట్రస్టు కింద  కేన్సర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ స్థాపించాలని చూస్తూ ఉంది. క్యాన్సర్  వ్యాధి చికిత్స లో వాడే రేడియో ధార్మిక మూలకం రేడాన్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించేందుకు చీఫ్ ఫిజిసిస్టుగా రావాలని టాటా ట్రస్టు ఆహ్వానించిందాయనను. 1938లో రేడియం సంగ్రహణ పరికరాలతో పాటు 2 గ్రాముల రేడియంతో బొంబాయిలోని టాటా మెమొరియల్ హాస్పెటల్‌కు ఆయన వచ్చారు. అలా ఆయన భారతదేశంలో మెడికల్ ఫిజిక్స్ ఆవిర్భవానికి బాట వేశారు.
ఇతని పర్యవేక్షణలో దేశంలోని మొట్టమొదటి రాడాన్ ప్లాంట్ నిర్మించబడి 1941 ఫిబ్రవరి 28న టాటా మెమొరియల్ ఆసుపత్రి ప్రారంభమైంది. ఈ ఆసుపత్రి 1952లో భారత ప్రభుత్వపు అణు ఇంధనశాఖ కు బదిలీ అయ్యింది. రేడియో ధార్మిక పదార్థంతో పనిచేస్తున్నపుడే ఆయన వాటి ప్రభావం వల్ల క్యాన్సర్ వచ్చింది. ఆయన కోలుకుని చాలా కాలం ప్రపంచానికి సైంటిఫిక్ సేవలందించారు.
డాక్టర్ నాయుడు  ముంబైలో ఉన్నప్పుడు లీల జన్మించింది.
1954లో పదనాలుగు సంవత్సరముల వయసులో
ఫెమినా మిస్ఇండియా గా ఎన్నుకొన బడింది. 1956లో 17వ యేటనే ఆమెకు ఒబెరాయ్ హోటల్ అధిపతి ‘టిక్కి‘ తిలక్ రాజ్ ఒబెరాయ్ తో విహామయింది.  అయితే, ఇద్దరు పిల్లల తర్వాత డైవోర్స్ తీసుకున్నారు.
వోగ్ పత్రిక లీలను మహారాణి గాయత్రీ దేవి సరసన పదిమంది మహాసౌందర్యవతులలో ఒకరిగా పరిగణించింది.
1960లో “అనూరాధ” అనే హిందీ సినిమా తో లీల హిందీ చిత్ర రంగంలో అడుగు పెట్టింది.హృషికేశ్ ముఖర్జీ దర్శకుడు, బలరాజ్ సాహ్ని కథానాయకుడు.
మిస్‌ ఇండియాగా ఎన్నికైన లీలా నాయుడు తొలిసారి ఇందులో హీరోయిన్‌గా నటించగా ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా బంగారు పతకం బహుమతి లభించింది. ఈ చిత్రం 1961 బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గోల్డెన్ బేర్ అవార్డుకు నామినేట్ అయింది.
నిజానికి ఆమె తొలిసినిమా రాజ్ కపూర్ తో రావలసి ఉండింది. ఆయన 1950లోనే ఆమెని గుర్తించారు.సినిమాకు ఒప్పందం కూడా జరిగింది. ఫోటోషూట్ కూడా పూర్తయింది. ఎందుకోగాని, ఆమె ఆఫర్ ని తిరస్కరించి ఆక్స్ ఫోర్డ్ వెళ్లిపోయారు.  తర్వాత తెరమీద కన్పించడానికి పదేళ్లు పట్టింది. రాజ్ కపూర్ నుంచి వచ్చిన ఆఫర్లను నాలుగు సార్లు తిరస్కరించిన నటి ఆమెయే.

 

ఆర్. కె.నాయర్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంగా 1963 లో
“యే రాస్తే హై ప్యార్ కే” చిత్రములో లీల నటించింది.
కెఎం నానావతి వర్సెస్ మహారాష్ట్ర కోర్టు కేసు ఆధారంగా నిర్మించిన ఏ రాస్తే హై ప్యార్ కే సినిమాలో సునీల్ దత్ సరసన ఆమె నటించారు.ఇది సునీల్ దత్ మొదటి సినిమా కూడా.  అపుడు ఈకేసు సంచలనమయినా, సినిమా అనుకున్నంతగా బాక్సాఫీస్ దగ్గిర విజయవంతం కాలేదు.ఇందులో కొన్ని పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఇందులో యే కామోషియా, యే తన్హాయియా… ఒకటి
1962లో “ఉమ్మీద్” 1963లో మర్చంట్-ఐవరీ వారి  హౌస్ హోల్డర్‌,1980 లో శ్యామ్ బెనెగల్ “త్రికాల్” లలో నటించింది. లీలానాయుడు చేసింది కొద్ది సినిమాలే అయినా బాలీవుడ్ చిత్రసీమపై చెరగని ముద్ర వేసిందనే చెప్పాలి.
1965లో విజయ్ ఆనంద్ గైడ్ లో రోజీ గా లీలాను తీసుకోవాలనుకున్నాడు. అయితే, ఈ పాత్రకి నాట్యం తెలిసిన నటి అవసరం కావడంతో ఆ అవకాశం వహీదా రెహ్మాన్ కు వెళ్లిపోయింది.

హౌస్ హోల్డర్ లో ఆమె నటన చూశాక సత్యజిత్ రే మార్లన్ బ్రాండో, శశికపూర్, లీలాలతో ‘జర్నీ’ అని ఇంగ్లీష్ సినిమా చేయాలను కున్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. హిందీ మెయిన్ స్ట్రీమ్ లో ఆమె చివరి సినిమా బాఘీ(1964).
తర్వాత 1969లో  మర్చంట్ ఐవరీ ‘గురు’ అతిధి పాత్రపోషించారు.1992లో ప్రదీప్ క్రిషన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎలెక్ట్రిక్ మూన్ ’ అమె చివరి సినిమా.
1969లో గోవాకు చెందిన కవి, రచయిత, తన చిన్ననాటి
స్నేహితుడు అయిన డామ్ మోరెస్ ని పెండ్లి చేసుకొంది.
25 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకొంది. ఒంటరితనంతో చాలా పోరాడింది. లండన్‌లో ఉండగా జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీకి ఆకర్షితులైంది ఆ తరువాత ముంబైకి మారింది. 1992లో వచ్చిన ఎలక్ట్రిక్ మూన్” ఆమె చివరి సినిమా.
అందాలనటి లీలనాయుడు 2009 జులై 28న ముంబాయి లో మరణించింది.
2009లో లీలా పేరుతో ఆమె మీద బిదిషా రాయ్ దాస్, ప్రియరంజన్ దత్తాలు డాక్యుమెంటరీ తీశారు.
Chandamuri Narasimhareddy

(Chandamuri Narasimhareddy, senior journalist, Khasa Subbarao rural journalism award winner. Mobile:9440683219)