అడివి శేష్, శశికిరణ్ తిక్కా ‘మేజర్’లో శోభిత ధూలిపాళ

యంగ్ హీరో అడివి శేష్ ‘మేజర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ఆయన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్.ఎస్.జి.) కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్నారు. ముంబైలోని తాజ్ మహల్ హోటల్లో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడిలో పలువురి ప్రాణాల్ని కాపాడి, ఆ క్రమంలో తన ప్రాణాల్ని త్యాగం చేసిన సైనికుడు మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ చిత్రం రూపొందుతోంది.
తెలుగు, హిందీ – ద్విభాషా చిత్రంగా మహేష్ బాబు నిర్మాణ సంస్థ ఘట్టమనేని మహేష్ బాబు (జి.ఎం.బి.) ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సోనీ పిక్చర్స్ ప్రొడక్షన్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంస్థలు నిరాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి.
అత్యంత ఆసక్తికర చిత్రాల్లో ఒకటిగా పరిగణింపబడుతున్న ఈ సినిమాలో తాజాగా శోభిత ధూలిపాళ జాయిన్ అయ్యారు. ఈ సినిమాలో ఆమె చాలా కీలక పాత్ర పోషిస్తున్నారని చిత్ర బృందం తెలిపింది. హీరో అడివి శేష్ తన ట్విట్టర్ పేజీలో స్పందిస్తూ, “మా మునుపటి ఫిల్మ్ ‘గూఢచారి’ తర్వాత ‘మేజర్’ సినిమా కోసం శోభితతో మరోసారి కలిసి పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీలో ఆమె పాత్రకు సొంత కథ ఉంటుంది. భావోద్వేగపరంగా మంచి డెప్త్ ఉన్న డైనమైట్ లాంటి రోల్ ఆమె చేస్తోంది. ‘మేజర్’ అనేది ఇండియాలోని అందరి కోసం చెబ్తున్న కథ” అని క్లుప్తంగా శోభిత పాత్రను పరిచయం చేశారు.
ప్రస్తుతం, ‘మేజర్’ సినిమా షూటింగ్ హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతోంది. అక్కడ ముఖ్య తారాగణంపై ప్రధాన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు