ప్రియమణి ప్రధాన పాత్రలో దర్శకుడు రాజేష్ టచ్‌రివర్ ‘సైనైడ్’

జాతీయ, అంతర్జాతీయ అవార్డు గ్రహీత రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వంలో జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి నటించనున్న చిత్రం ‘సైనైడ్’.  మిడిల్ ఈస్ట్ సినిమా ప్రై లిమిటెడ్ పతాకంపై ఎన్నారై పారిశ్రామికవేత్త ప్రదీప్ నారాయణన్ నిర్మిస్తున్నారు. దేశంలోనే సంచలనం సృష్టించిన ‘సైనైడ్’ మోహన్ కేసు ఆధారంగా క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషలలో సినిమాను రూపొందిస్తున్నారు. దక్షిణాది భాషల్లో ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తుండగా… హిందీలో ఆ పాత్రలో యశ్ పాల్ శర్మ నటిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు రాజేష్ టచ్‌రివర్ మాట్లాడుతూ “సైనైడ్ ఇచ్చి 20మంది యువతులను కిరాతకంగా హత్య చేసిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మోహన్ కేసును అత్యంత అరుదైన కేసుగా కోర్టు తీర్మానించింది. ఈ సంచలనాత్మక కేసు ప్రేరణగా తీసుకొని ‘సైనైడ్’ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాం. జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి పవర్ ఫుల్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు” అని అన్నారు.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత ప్రదీప్ నారాయణన్ మాట్లాడుతూ “ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా వున్న ప్రియమణి ఇందులో లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ చిత్రం కథాంశం విషయానికి వస్తే… దాదాపు 20 మంది యువతుల్లో ప్రేమను ప్రేరేపించి కర్ణాటకలోని వివిధ హోటల్ గదులలో వారితో శారీరక సుఖాలు అనుభవించి, ఆ తర్వాత గర్భనిరోదక మాత్రల పేరిట సైనైడ్ ఇవ్వడం ద్వారా హత్య చేసి బంగారు ఆభరణాలతో బయటపడిన మోహన్ కథే సినిమా. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 20 మంది అమ్మాయిలను అతను కనికరం లేకుండా హత్య చేశాడు. ఈ కేసులో కోర్టు అతనికి 6 మరణశిక్షలు, 14 జీవిత ఖైదులను విధించింది. ఈ కేసు తుది తీర్పు కూడా వెలువడింది” అని అన్నారు.

ఇంకా నిర్మాత మాట్లాడుతూ “జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. బెంగళూరు, మంగళూరు, కూర్గ్, మడిక్కెరి, గోవా, హైదరాబాద్, కాసరగోడ్ కీలకమైన షూటింగ్ ప్రదేశాలలో షూటింగ్ కొనసాగుతుంది” అని అన్నారు.
ప్రియమణి, యశ్ పాల్ శర్మ, చిత్రంజన్ గిరి, తణికెళ్ల భరణి, రాంగోపాల్ బజాజ్, సిజ్జు, శ్రీమాన్, సమీర్, రోహిణి, సంజు శివరామ్, షాజు ముకుందన్, రిజు బజాజ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు  ‘విశ్వరూపం’, ‘ఉత్తమ విలన్’ వంటి చిత్రాలకు కమల్ హసన్ తో కలిసి పనిచేసిన సదాత్ సైనూద్దీన్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు.
అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జార్జ్ జోసెఫ్ సంగీతం అందిస్తున్నారు. అనేక హిందీ, తమిళ, తెలుగు, కన్నడ చిత్రాలకు ఎడిటింగ్ చేసిన శశి కుమార్ ఎడిటింగ్. రాష్ట్ర అవార్డు గ్రహీత గోకుల్ దాస్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. పలు అవార్డులు అందుకొని, ఇటీవల ‘వి’ సినిమాకు మేకప్ లో స్పెషల్ ఎఫెక్ట్స్ తో ప్రశంసలుపొందిన స్పెషల్ ఎఫెక్ట్ మేకప్ మెన్ గా ఎన్.జి. రోషన్,  రాజేష్ టచ్ రివర్ పలు చిత్రాలకు మాటలు రాసిన రవి పున్నం మాటల రచయితగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజేష్ టచ్ రివర్, కంటెంట్ సలహాదారు: పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్, నిర్మాత: ప్రదీప్ నారాయణన్.