‘302’ ట్రైలర్ ఆవిష్కరించిన సునీల్

భవికా దేశాయ్ ప్రధాన పాత్రలోను, వెన్నెల కిశోర్, రవివర్మ, విజయసాయి, తాగుబోతు రమేష్ కీలక పాత్రలలోను నటించిన చిత్రం 302. (దీనికి ది ట్రూ స్టోరీ ఆఫ్ రియల్ ఫేక్ అన్నది ఉపశీర్షిక)  కార్తికేయ మిరియాల  దర్శకత్వంలో డ్రీమ్ ట్రీ మీడియా పతాకంపై అవినాష్ సుందరపల్లి నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్రం ట్రైలర్ ను ఆదివారం హైదరాబాద్ లో ప్రముఖ నటుడు సునీల్ ఆవిష్కరించారు. అనంతరం సునీల్ మాట్లాడుతూ, మా కామెడీ కుటుంబ సభ్యులు వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, వేణు తదితరులు చేసిన చిత్రం. ట్రైలర్ బావుంది. చిత్రం కూడా ప్రేక్షకులను అలరింపచేస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు. చిత్ర నిర్మాత అవినాష్. సుందరపల్లి మాట్లాడుతూ, నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ద్వారా ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు  తెలిపారు.
దర్శకుడు కార్తికేయ మిరియాల మాట్లాడుతూ, క్రైమ్, సస్పెన్స్, కామెడీ అంశాలతో పాటు కాస్త హారర్ అంశాలను మేళవించి ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా ఈ చిత్రాన్ని మలిచాం. ఒక రోజులో అంటే 24 గంటల్లో జరిగే కథ ఇది. ఒక అమ్మాయి ప్రేమ విషయంలో తల్లితండ్రులతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది తెరపై చూడాల్సిందే. కడుపుబ్బ నవ్వించే కామెడీ సీన్స్ కూడా ఇందులో వున్నాయి,. ఇంటర్నేషనల్ మోడల్ సూఫీ సయ్యద్ చేసిన ఐటెం సాంగ్ ఓ హైలైట్ అని చెప్పారు.
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో వేణు టిల్లు, జబర్దస్త్ రాకేష్, నవీన్, దేవీచరణ్ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి కెమెరా: కళ్యాణ్ సమీ, రామరాజు, సంగీతం : రఘురాం, ఎడిటింగ్: రంగస్వామి, ఆర్ట్: వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుమార్ రాజా, సహ నిర్మాత: టి..వైకుంఠరావు, నిర్మాత: అవినాష్ సుందరపల్లి, కథ, దర్శకత్వం: కార్తికేయ మిరియాల.