అయ్యప్పనుమ్ కొషియమ్’ మలయాళం రివ్యూ!

 (పవన్ కళ్యాణ్ – దగ్గుబాటి రానాలతో రీమేక్ అవుతున్న మలయాళ ఒరిజినల్ ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ అసలెలా వుందో చూద్దాం…)

 

కథ

నూట యాభై ఏళ్ల క్రితం కేరళలోని పాలక్కడ్ లో ఒక అమ్మవారి జాతరలో భాగంగా కుమ్మట్టి కాళి అనే పౌరాణిక ప్రదర్శన పుట్టింది. పాలక్కడ్ తో బాటు, త్రిసూర్, మలబార్ లలో ఓనం పండగప్పుడు ఈ జాతర జరుగుతుంది. ఈ పౌరాణికం శివుడికీ అర్జునుడికీ మధ్య సన్నివేశం… మారువేషంలో  వున్నశివుడి పాశుపతాస్త్రం కోసం అర్జునుడి పోరాటం… అది మనస్సు నుంచి, నేత్రాల నుంచి, వాక్కు నుంచీ వెలువడే అత్యంత విధ్వంసకర అస్త్రం. దాన్ని సమవుజ్జీ కాని శత్రువుపై ప్రయోగించరాదు, అలాగే యోగ్యులు కాని యోధులు వాడరాదు. ‘అయ్యప్పనుం కోషియం’ ప్రారంభ దృశ్యంగా ఈ ప్రదర్శన జరుగుతోంది…పాశుపతాస్త్రం అర్జునుడి వశమైంది శివుడి ఔదార్యంతో చివరికి. 

 ఇగో కూడా భయంకర పాశుపతాస్త్రం. ఇగోలతో ఇద్దరు వ్యక్తుల మధ్య వైషమ్యాలు ఎవరికీ గెలుపు నివ్వవు, ఓటమినీ ఇవ్వవు. నిరంతర విధ్వంసంతో ఇద్దరూ అంతమైపోవడమే. అతను బలమైన రాజకీయ సంబంధాలున్న మాజీ ఆర్మీ హవల్దార్. ఇతను సామాన్య పోలీస్ ఎస్సై. సామాన్యుడితో ఇగో ఏమిటని బలవంతుండు అనుకోవడం లేదు. బలవంతుడితో ఇగో ఎందుకని సామాన్యుడూ అనుకోవడం లేదు. ఇద్దరూ బాహాబాహీకి దిగారు, ఒక ముగింపులేని పోరాటానికి తెరలేపారు.

అతను ఊటీలో సినిమా షూటింగు జరుపుకుంటున్న మిత్రుడైన ఒక దర్శకుడు అడిగితే, పూటుగా తాగి, పెట్టె నిండా మద్యం బాటిళ్ళు కార్లో పెట్టుకుని బయల్దేరాడు. మద్యనిషేధం అమల్లో వున్న అట్టప్పడి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో పోలీస్- ఎక్సైజ్ జాయింట్ ఆపరేషన్లో దొరికిపోయాడు. దొరికిపోవడమే గాక నానా గలభా చేసి ఎక్సైజ్ అధికారిని కొట్టాడు. అతణ్ణి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించాడు ఎస్సై అయ్యప్పన్ నాయర్. పేరడిగితే కోషీ జాన్ అని చెప్పాడు. ఫోన్ చెక్ చేస్తే సీఎం పినరయి విజయన్, మాజీ సీఎం ఊమెన్ చాండీలతోబాటు, ఇంకొందరు నాయకులు, జర్నలిస్టుల ఫోన్ నెంబర్లూ వున్నాయి.

కంగారుపడి పై అధికారికి ఫోన్ చేసి చెప్పాడు అయ్యప్పన్. అతణ్ణి డీసెంట్ గా ట్రీట్ చేసి, కేసు బుక్ చేసి కోర్టుకి హాజరు పర్చమన్నాడు పై అధికారి. ఇక తన అరెస్టు, కోర్టు, జైలూ తప్పవని గ్రహించిన కోషీ, తెలివిగా నాటకమాడేడు. తనకి మద్యం కావాలనీ, మద్యం లేకపోతే హెల్త్ ప్రాబ్లమనీ చెప్పి నమ్మించి, సీజ్ చేసిన లిక్కర్ లోంచి కొంత పోయించుకుని తాగాడు. ఇదంతా ఫోన్ లో రికార్డు చేశాడు. ఉదయం కోర్టుకీ, అట్నుంచి అటే జైలుకీ వెళ్ళాక, బెయిలు మీద విడుదలై వచ్చి, ఫోన్లో రికార్డు చేసిన వీడియోని ఛానెల్లో బట్టబయలు చేశాడు.
దీంతో మద్యం కేసులో అరెస్టయిన నిందితుడికి మద్యం పోసిన ఇంకో నిందితుడిగా మారి, సస్పెండ్ అయిపోయాడు ఎస్సై అయ్యప్పన్ నాయర్, లేడీ కానిస్టేబుల్ సహా. ఇక కోషీ – అయ్యప్పన్ ల రగడ, రచ్చ, కచ్చ మొదలైపోయాయి. తనని సస్పెండ్ చేయించినందుకు కోషీ ముందే కోషీ అనుచరుణ్ణి విపరీతంగా కొట్టాడు అయ్యప్పన్. దీంతో కోషీ తండ్రి కురియన్ జాన్ కోషీకి అంగరక్షకులుగా కొందరు వృత్తి నేరస్థుల్ని పంపాడు.

కురియన్ జాన్ కూడా బలమైన రాజకీయ సంబంధాలున్న మాజీ ఆర్మీ హవల్దార్. అతను విపరీతంగా ఇగోకి పోయి అయ్యప్పన్ భార్య అరెస్టుకి పావులు కదిపాడు. అయ్యప్పన్ ఆదివాసీ మావోయిస్టు కార్యకర్త అయిన కణ్ణమ్మని పెళ్లి చేసుకున్నాడు. అయ్యప్పన్ అంతు చూడాలని కోషీ అట్టప్పడిలోనే లాడ్జిలో మకాం వేశాడు. అయ్యప్పన్ జేసీబీ పెట్టి కోషి కార్యాలయాన్ని కూల్చేశాడు.

కోషి తను కూడా జేసీబీ పెట్టి అయ్యప్పన్ ఇంటిని కూల్చేశాడు. కోషీ ఇల్లు కూల్చేస్తే కోషీ కారుని పేల్చేశాడు అయ్యప్పన్. ఇలా దాడికి ప్రతి దాడి చేసుకుంటూ పోలీసుల్ని పరుగులు పెట్టించారు. తన వ్యవహారంలో తండ్రి అనవసరంగా జోక్యం చేసుకుని ఇబ్బందిలో పడేస్తున్నాడని, అతణ్ణి అరెస్ట్ చేయించేశాడు కోషీ.
ఇలా మరెన్నో సంఘటనలు జరిగి, ఇక ఫైనల్ గా చావో రేవో  తేల్చుకోవా లనుకున్నారు.  సరిహద్దు దాటి తమిళనాడులో కొట్టుకునే కార్యక్రమం పెట్టుకుంటే, కేరళ పోలీసులు అడ్డు రారనుకున్నారు. అలా తమిళనాడు మార్కెట్ లో కొట్టుకోసాగారు. తమిళ పోలీసులతోబాటు కేరళ పోలీసులు కూడా వచ్చేసి  అయ్యప్పన్ కోషీని చంపకుండా ఆపబోయారు. అయ్యప్పన్ ఆగేటట్టు లేడు. అయ్యప్పన్ మీద సస్పెన్షన్ ఎత్తేశారని సీఐ చెప్పడంతో, అయ్యప్పన్ శాంతించి కోషీని వదిలేశాడు. ఇక కోషీ సొంతూరు కట్టపణకే ట్రాన్స్ ఫర్ చేయించుకుని, కొత్త ఎస్సైగా కోషీని పరిచయం చేసుకుని, కరచాలనం చేశాడు అయ్యప్పన్.

ఎలావుంది కథ

కోషీ పాత్ర పోషించిన నటుడు, నిర్మాత, దర్శకుడు, పంపిణీ దారుడు, గాయకుడూ అయిన – నూరు సినిమాలూ నటించిన- పృథ్వీరాజ్ సుకుమారన్ కి, అయ్యప్పన్ పాత్ర నటించిన శతాధిక చిత్రాల నటుడు బిజూ మీనన్ కీ మలయాళంలో విపరీతమైన ఫాలోయింగ్ వుంది. ఏ ఒక్కర్ని తక్కువ చేసి చూపించినా ఆ అభిమానులతో సమస్య లొస్తాయి.
అందుకని ఎవరి గెలుపూ, ఎవరి ఓటమీ లేని, ఇదమిత్థమైన ఒక ముగింపూ లేని కథగా ఇది తెరకెక్కింది. దీంతో నటులుగా వాళ్ళ ఇమేజులకి న్యాయం జరిగిందేమో గానీ, కథకి న్యాయం జరగలేదు. కథ ప్రకారం వాళ్ళ ఇగోలతో వాళ్ళే తేల్చుకోకుండా, మధ్యలో పై అధికారుల జోక్యంతో శాంతించడం పాత్రౌచిత్యాల్ని దెబ్బ తీసింది. అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవల్ని పై అధికారులూ నాయకులూ కల్పించుకుని ఎప్పుడో ఆపి వుండొచ్చు.   సహజంగా ఇదే జరుగుతుంది. మొదట్నుంచీ జరిగేవన్నీ జరగనిచ్చి, చిట్టచివరికి మధ్యలో దూరి కథని ఆపారు అధికారులు. కథ ఆగింది కానీ ముగియలేదు. పాపులర్ నటుల ఇమేజుల్ని కాపాడేందుకు కథతో ఇలా చేయాల్సి వచ్చింది దర్శకుడికి.

చివరికేమిటి

కృత్రిమత్వం, ఫార్ములా, మూస అనేవాటికి దూరంగా కేరళ గ్రామీణ నేటివిటీ కోసం కృషి చేశాడు దర్శకుడు సాచీ. ఈ హాట్ కథకి కూల్ కలర్స్ వాడి నేత్రానందం కల్గించాడు. పాటలు లేవు. నేపథ్య సంగీతం మాత్రం ట్రైబల్ ట్యూన్స్ కుదరక కుదేలయింది. మాటలు సింథటిక్, డిజైనర్, మూస, పంచ్, టెంప్లెట్ ధోరణుల నుంచి రిలీఫ్ గా, మనుషులు మాట్లాడుకున్నట్టు వున్నాయి. ఫైట్లు మనుషులు పోరాడుకున్నట్టున్నాయి.

దాదాపు మూడు గంటల నిడివే ఈ స్వల్ప కథకి, అత్యల్ప కాన్ఫ్లిక్ట్ కీ బాగా ఎక్కువ. ఒక దశ కొచ్చేటప్పటికి చిన్న విషయానికి ఇంత సాగదీయడం అనవసర మన్పిస్తుంది. నాయకులూ ఉన్నతాధికార్లూ ఇద్దర్నీ కూర్చోబెట్టి క్లాసు తీసుకుంటే, ఎప్పుడో ముగిసిపోయే గొడవ. కథకి పాశుపతాస్త్రంతో పోలిక వర్కౌట్ కాని పరిస్థితి ఇంకో పక్క. ఇంతకి ముందు చెప్పుకున్నట్టు ఎమోషనల్ ప్రేక్షకులతో బాటు, ఇద్దరు నటుల ఫ్యాన్స్ తో దీనికింత టాక్ వచ్చి వుంటుంది.

 

సికిందర్

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *