ఐవైఆర్  “ఎవరి రాజధాని అమరావతి” పై చర్చకు ప్రభుత్వం ముందుకు రావాలి

 (యం. పురుషోత్తం రెడ్డి*)

సీనియర్  ఐఎఎస్  అధికారి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్సి IYR క్రిష్ణారావు గారు రచించిన “ఎవరి రాజధాని అమరావతి”  పుస్తకం రాష్ట్రంలో ప్రధాన చర్చగా మారింది. రాజధానిని ఎంపిక చేసిన సందర్భంలో  వారు ప్రధాన కార్యదర్సిగా ఉండటం వలన వారు ప్రస్తావిస్తున్న అంశాలకు అత్యంత ప్రాదాన్యత లబిస్తుంది. అధికార పక్షం ఎప్పటి లాగే వారు మాట్లాడుతున్న అంశాలను చర్చకు పెట్టి విభేదించడమో లేదా సమర్ధించడమో కాకుండా కుట్రకోణంలో ఎదురుదాడిని ఎంచుకుంది. ప్రచార మాద్యమాలు, ప్రధాన రాజకీయ పార్టీలు కచ్చితంగా IYR రచిచంచిన పుస్తకంపై తమ అభిప్రాయాలు చెప్పాలి.

ముక్కుసూటి తనం, నమ్మిన అంశాలపై రాజీలేని పోరాటం ,  పట్టుదలకు ప్రతీక IYR. తిరుపతిలో వారి రచనపై చర్చ జరుగుతున్న సందర్భంలో ఒక విషయాన్ని కచ్చితంగాప్రస్తావించాలి.  బహుషా   IYR  అనే అధికారి  లేకుండా ఉండి ఉంటే నేడు చారిత్రక తిరుమల ఆనంద నిలయం ఇపుడున్న రూపంలో ఉండేది కాదు. IYR గారు రచనలో ప్రభుత్వంపై విమర్సకన్నా ప్రపంచ దేశాల అనుభవాలను ప్రాతిపదికగా నూతన రాష్ట్రానికి రాజధాని ఎలా ఉండాలి అన్న అంశాన్ని మాత్రమే వారు ప్రజల ముందు ఉంచారు. IYR ప్ర స్తావించిన అంశాలను పరిసీలిస్తే నూతన రాజధాని ఎంపిక, దాని నిర్మాణం కోసం వారు ప్రపంచ దేశాలను తిరిగి పరిశీలించినారా అన్న అనుభూతి కలగక మానదు.

IYR రచించిన పుస్తకంలో ప్రధాన అంశాలు

మహనగరం- ఆంద్రప్రదేశ్…..  మహనగరం ఒక కల మాత్రమే. అది పాలించే వారి ఆనందం మాత్రమే. ఎందుకంటే ఇది రాజరికం కాదు ప్రజాస్వామ్యం. విభజన అనంతరం ఏర్పడిన పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని ఎంపిక చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది శ్రీభాగ్ ఒప్పందం. ఎందుకంటే దాని ప్రాతిపదికనే మద్రాసు నుంచి విడిపోయింది. అందులో ఉన్నది ప్రధానంగా  అభి వృద్ది వికేంద్రీకరణ రాజధాని, హైకోర్టు ఒక చోట అవసరం లేదని. ఏపి ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్యకోస్తా ఉత్తర కోస్తా లుగా విబిన్నంగా ఉంటుంది. అందుకే కేంద్రీకృత అభివృద్ది అవసరం లేదు. మరో ముఖ్యమైన అంశం హైదరాబాదు పోలిన మహనగరం ఆలోచన సాధారణ ప్రజలకు ఉండవచ్చును కానీ పాలకులకు ఉండటం మంచిది కాదు. ఇప్పటికే తిరుపతి, విశాఖ, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, కర్నూలు లాంటి నగరాల జనాబా దాదాపు 5 లక్షలు పై మాటే. విశాఖ జనాబా మరింత ఎక్కువ. అంటే అరకోటి జనాబా గలిగిన నగరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాక దాదాపు నగరాల స్థాయి కలిగిన పట్టణాలు 15 పైగా ఉన్నాయి. వాటి జనాభా కూడా దాదాపు అరకోటి. పెద్ద సంఖ్యలో మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు ఉన్నాయి. మొత్తంగా పరిసీలిస్తే ఏపీలో కొత్తగా మరో నగరాన్ని నిర్మించడానికి అనువైన వాతావరణం లేదు. అలాంటిది ఏకంగా మహనగరాన్ని నిర్మించడానికి పూనుకోవడం తొందరపాటు చర్య అవుతుంది. IYR ఉదహరించింది కూడా స్వల్పకాలంలో మహనగరాలను నిర్మించలేము. ప్రపంచంలో ఆదర్శమైన అమెరికాకు రాజధాని వాషింగ్ టన్ డీ సీ అయితే ఆదేశ మహనగరం న్యూయార్క్. ఆ దేశంలోని ఒక రాష్ట్రం కాలిపోర్నీయా రాజధాని సాక్రమెంటో అయితే ఆ రాష్ట్రంలోని మహనగరం లాస్ ఏంజల్స్. అలాగే ఆస్ట్రేలియా రాజధాని కాన్ బెర కాగా మహనగరాలు మాత్రం సిడ్నీ, మెల్ బోర్న్. IYR పై రెండు దేశాల రాజధానులను, మహనగరాలను ఉదహరించడంలో దూరదృష్టి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఆర్దికస్థితిలో  తప్ప రాష్ట్రం వాటినిపోలి ఉంటుంది. విజయవాడ, తిరుపతి, విశాఖ అభివృద్ది చెందిన నగరాలు ఉన్నాయి. కొత్తగా మరో నగరాన్ని నిర్మిండం కన్నా అందుబాటులో ఉన్న నగరాలపై శ్రద్ధ పెట్టవచ్చు అన్న సూత్రీకరణ అత్యంత విలువైనది.

అమరావతి ఎంపిక –అభివృద్ది ఆందోళనాకరం

అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన పద్ధతి బహుశా ప్రపంచంలోనే ఎక్కడా జరగని రీతిలో జరిగింది. శ్రీభాగ్ ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకోలేదు. కేంద్రం నియమించిన శివరామక్రిష్ణన్ నివేదికను పరిశీలించక, తాను నియమించిన నారాయణ నివేదికలో ఏముంది అన్న అంశాలుపై చర్చకూడా పెట్ట కుండా ఏక పక్షంగా అమరావతిని కొన్ని గంటలలో ఎంపిక చేసినారు. ప్రపంచంలో కనీస పరిశీలన చేయకుండా ఎంపిక చేసిన రాజధానిగా అమరావతి మిగిలిపోతుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థికంగా  మంచి స్థితిలో రాష్ట్రం లేదు. కేంద్రం నియమించిన కమిటిని అసలు పట్టించుకోలేదు. విభజన చట్టంలో రాజధాని మౌళిక వసతులు, సచివాలయం, హైకోర్టు, గవర్నర్ బంగ్లా లాంటివి కేంద్రం నిర్మించాలి. వాటి విషయంలో ఏనాడు కేంద్రాన్ని అడిగిన దాఖలాలు లేవు. అనేక మంది నిపుణుల దృష్టిలో అమరావతి ప్రాంతం వరద ముంపుకు అవకాశం ఉన్న ప్రాంతం. గొప్ప నిర్మాణాలకు అనుకూలమైన ప్రాంతం కాదు. అక్కడ జరిగే నిర్మాణాలకు వ్యయం కూడా అధికంగా ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం ముందుకు వెళతామంటుంది. అననుకూల ప్రాంతం అయిన అమరావతి నిర్మాణం జరగడం లేదు. ప్రభుత్వం దృష్టి మొత్తం అమరావతి వైపు కేంద్రీకృతం చేయడం వలన అభివృద్దికి అవకాశం ఉన్న తిరుపతి, విశాఖ కు తీవ్రనష్టం జరుగుతుంది.

 

శివరామక్రిష్ణన్ నివేదిక శిరోధార్యం- IYR చూచనలు అనుసరణీయం

 

నగర నిర్మాణాల పట్ల మంచి అవగాహణ కలిగిన శివరామక్రిష్ణన్ నివేదిక నేటి పరిస్థితులలో శిరోధార్యంగా కనిపిస్తుంది. అదే సందర్బంలో తన అనుభవం, ప్రపంచ దేశాల పరిస్థితులను జోడించి IYR రచించిన పుస్తకం లోని అంశాలు అనుసరణీంగా కనిపిస్తున్నాయి. IYR కి దురుద్దేశ్యాలు ఆపాదించడం మాని వారి చూచనలను పరిశీలించడం మంచిది. IYR పదవిలో ఉన్నపుడు ఎందుకు చెప్పలేదు అంటూ అడ్డగోలు వాదనలు చేయడం మంచిది కాదు. కనీస పద్దతులు లేని రాజకీయ పార్టీలలో పని చేసే నాయకులు పార్టీలో ఉన్నన్ని రోజులు పార్టీకి భిన్నంగా  మాట్లాడకూడదని నీతులు చెపుతున్న వారు అఖిలభారత సర్వీసులో ఉన్న వ్యక్తి వృత్తి ధర్మానికి బిన్నంగా మాట్లాడకూడదన్న విషయం తెలియదా. పై సర్వీసు లో ఉన్న వారు పదవి విరమణ తర్వాత కూడా ఒక ఏడాది పాటు ఇతర ప్రయివేటు సర్వీసులో కూడా ఉండకూడదు అన్న నిబంధన ఉందన్న సంగతి తెలిసి కూడా అపుడు ఎందుకు మాట్లాడ లేదు అంటున్నారు అంటే అమరావతి విషయంలో మాదారి మాది అన్న వైకరితో ప్రభుత్వం ఉన్నట్లు కనపడుతుంది. అమరావతి కేంద్రీకృత అబివృద్ధి కారణంగా జరిగే నష్టానికి  మూల్యం చెల్లించేది ప్రజలు మాత్రమే. శివరామక్రిష్ణన్ తాను చనిపోయే ముంది ఏపీ ముఖ్యమంత్రిని ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలు  ఆందోళన కలిగించడమే కాదు పాలకులను, ప్రజలను ఆలోచింప చేసేవిగా ఉన్నాయి.

 

“నాయుడి గారు ముందున్న ప్రధాన అంశం రాష్ట్ర సమతౌల్య అభివృద్ధి.  ఇప్పటికీ నాయుడు గారికి తన అడుగులు వెనుకకు తీసుకొనే అవకాశం ఉన్నది. ఒక చరిత్రలో నిలిచిపోయే రాజధాని నిర్మాణం ప్రధాన అంశం కాదు. ఈనాడు ప్రధాన అంశం రాష్ట్రం ప్రభుత్వం ఆత్మహత్యా సాదృశ్యంగా రాష్ట్ర వనరులను శక్తిని రాజధాని ప్రాజెక్టు కోసం తాకట్టు పెట్టడం”

 

*యం. పురుషోత్తం రెడ్డి,రాయలసీమ మేధావుల పోరం,తిరుపతి.9490493436

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *