తొలి పోటీలో ధోనీ సేన ఘన విజయం

(బి.వెంకటేశ్వరమూర్తి)

చెన్నై:  ప్రిమియర్ లీగ్ ఆరంభ పోటీలో చైన్నై లో స్పిన్ అనుకూల పిచ్ పై జరిగిన లో స్కోర్ మ్యాచ్ లో మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ పై ఏడు వికెట్ల ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన, సీనియర్ స్పిన్నర్ లు హర్భజన్, రవీంద్ర జడేజా, ఇమ్రాన్ తాహిర్ల బౌలింగ్ ధాటికి తాళలేక 70 పరుగులకే కుప్ప కూలిపోగా, చెన్నై కింగ్స్ 17.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. కేదార్ జాదవ్ 13, జడేజా 6 పరుగులతో అజేయంగా మిగిలారు.

యజువేంద్ర చహాల్ తో ఆర్ సి బి బౌలింగ్ ఆరంభించింది. అతను వేసిన రెండో ఓవర్ మొదటి బంతికే షేన్ వ్యాట్సన్ క్లీన్ బౌల్ అయ్యాడు. బంతి బంతీ పాములా స్పిన్ అవుతుండటంతో, పేస్ బౌలింగ్ ఆడటం కూడా కష్టసాధ్యమవడంతో చేపాక్ పిచ్ పై బ్యాటింగ్ దినదిన గండంగా సాగింది. అయినా లక్ష్యం కేవలం 71 పరుగులే కావడంతో చెన్నై జట్టు సాహసాలకు పోకుండా దుర్బలమైన బంతుల కోసం నిరీక్షిస్తూ, గ్యాప్ లలోకి బంతిని తాటించి ఒకట్రెండు పరుగులు జోడిస్తూ జాగ్రత్తగా ముందుకు సాగింది.

9.2 ఓవర్లలో రైనా అవుటయ్యేసరికి చెన్నై స్కోరు 40 పరుగులు. 21 బంతుల్లో మూడు బౌండరీలతో 19 పరుగులు చేసిన సురేష్ రైనా, నేటి ఇన్నింగ్స్ 15వ పరుగుతో ఐపిఎల్ లో 5000 పరుగుల మైలురాయి దాటిన తొలి బ్యాట్స్ మన్ గా రికార్డు సాధించాడు.

నిలకడగా ఆడుతున్న అంబటి రాయుడు, తర్వాత వచ్చిన కేదార్ జాదవ్ తో కలిసి చెన్నైస్కోరును 14వ ఓవర్ కు 58 దాకా తీసికెళ్లాడు.

15వ ఓవర్ రెండో బంతిపై రాయుడు మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో బౌల్ అయ్యాడు. అతను 42 బంతుల్లో రెండు బౌండరీలు ఒక సిక్సర్ తో 28 పరుగులు చేశాడు.

అంత క్రితం చెన్నై స్పిన్నర్లను ఆడలేక అల్లాడిపోయిన రాయల్స్ ఛాలెంజర్స్ బెంగుళూరు 17.1 ఓవర్లలో 70 పరుగులకే ఆలౌటయింది. ఐపిఎల్ లో చెన్నైకి ఇది రెండవ అత్యల్ప స్కోరు. ఇది వరకు 2017లో కెకెఆర్ చేతిలో 49 కుప్పకూలిన చరిత్ర ఆర్ సి బిది.

ఐపిఎల్ చరిత్రలో తొలిసారిగా ప్రారంభోత్సవ పటాటోపం లేకుండానే బెంగుళూరు -చెన్నై మ్యాచ్ ఆరంభమైంది. ప్రారంభోత్సవానికి అయ్యే ఖర్చును టెర్రరిస్టు దాడిలో మరణించిన సిఆర్ పిఎఫ్ జవాన్ల కుటుంబాలకు  సహాయంగా అందించాలని నిర్వాహకులు నిర్ణయించారు.

ఆర్ సి బి బ్యాట్స్ మెన్ లో ఒక్క పార్థివ్ పటేల్ మాత్రమే 35 బంతుల్లో రెండు బౌండరీలతో 29 పరుగులు చేశాడు. మిగత వారందరూ పది లోపే అవుటయ్యారు. భారత మాజీ తార హర్భజన్ వేసిన రెండో ఓవర్ లోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం ఆరు పరుగులకే వెనుతిరగడంతో ఆర్ సి బి పతనం ప్రారంభమయింది. తర్వాత వచ్చిన మొయినలీ హర్భజన్ కే క్యాచ్ ఇచ్చి తొమ్మిది  పరుగులకు ఆవుటయ్యాడు.

హర్భజన్ బౌల్ చేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్హ లో ఆర్ సి బి ఏకంగా రెండు వికెట్లు కోల్పోయింది. డివిలియర్స్ రెండో బంతిపై జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అంతక్రితం బంతికే డివిలియర్స్ కి లైఫ్ లభించింది. అతను కొట్టిన స్వీప్ షాట్ ని డీప్ స్క్వేర్ లెగ్ లో ఇమ్రాన్ తాహిర్ చేతుల్లోకి వచ్చిన క్యాచ్ ని వదిలేశాడు. తర్వాతి బంతిపై మళ్లీ స్వీప్ కై ప్రయత్నిస్తే షాట్ సరిగా పడక మిడ్ వికెట్ లోకి క్యాచ్ లేచింది. ఈ సారి రవీంద్ర జడేజా ఎలాంటి పొరరపాటు చేయలేదు. ఇదే ఓవర్ ఆరో బంతిపై విండీస్ హార్డ్ హిటింగ్ బ్యాట్స్ మన్ హెట్మయర్ రనౌట్ అయ్యాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతిని ఆఫ్ సైడ్ లోకి ఆడిన హెట్మయర్ అతను సింగిల్ కోసం ముందుకు దూసుకెళ్లగా అటు వైపు పార్థివ్ పటేల్ నుంచి స్పందనే కరలవైంది. షార్ట్ మిడాఫ్ లో ముందుకు దూకి బంతి అందుకున్న సురేష్ రైనా అదే ఊపులో ధోనీకి అందించాడు.  మెరుపు వేగంతో ధోనీ వికెట్లు పడగొట్టేసరికి హెట్మయర్ పదడుగుల దూరంలో మిగిలిపోయాడు. ఆ సరికి 8 ఓవర్లలో బెంగుళూరు జట్టు 39 పరుగులే చేసింది. స్కోరు 53 పరుగులుండగా ఏడో వికెట్ ను, 59 వద్ద ఎనిమిదో వికెట్ ను ఆర్ సి బి కోల్పోయింది.

రైనా బౌల్ చేసిన తొమ్మిదో ఓవర్ లో ఆర్ సి బి ఆరు పరుగులు చేసింది.  ఈ ఓవర్ లో వికెట్టేదీ పడకపోవడం విశేషం. పదో ఓవర్ లో ఇమ్రాన్ తాహిర్ శివమ్ దూబేను, 11 వ ఓవర్లో జడేజా గ్రాండ్ హోమ్ ను అవుట్ చేశారు. ఆ సరికి బెంగుళూరు స్కోరు 6 వికెట్లకు 50 పరుగులు. నాలుగు ఓవర్లలో 20 పరుగులిచ్చి, కోహ్లీ, డి విలియర్స్ లను ఆరంభంలోనే అవుట్ చేసి బెంగళూరును చావుదెబ్బ తీసిన హర్భజన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెల్చుకున్నాడు.

(మూర్తి, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు, బెంగుళూరు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *