జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం రోశయ్య

ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం వైఎస్సార్ అంటే రోశయ్యకు ఎనలేని అభిమానం. ఈ విషయం పలు సందర్భాల్లో ఆయన మాటల్లోనే స్పష్టంగా వెల్లడైంది. వైఎస్సార్ కుటుంబం మీద ఇప్పటికీ ఆయన హృదయంలో స్థానం అలానే ఉందని మరోసారి నిరూపించుకున్నారు రోశయ్య.

గుంటూరు సిమ్స్ విద్యాసంస్థల అధినేత భీమనాధం భరత్ రెడ్డి హైదరాబాదులో రోశయ్యని కలిశారు. భరత్ రెడ్డి రూపొందించిన వస్తున్నాడు…జగనన్న వస్తున్నాడు సాంగ్ ను రోశయ్య తన నివాసంలో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ ను కొనియాడారు. వైఎస్సార్ తో తనకు విడదీయలేని అనుబంధం ఉందని గుర్తు చేసుకున్న ఆయన…జగన్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారని అన్నారు.

వైఎస్సార్ ఎంతో కష్టపడి పాదయాత్ర చేసారని తెలిపారు. సీఎంగా ప్రజలకు ఎంతో సేవ చేశారని, అందుకే ఆయనకు విపరీతమైన ప్రజాదరణ లభించిందని అన్నారు. అలాగే జగన్ కూడా పాదయాత్ర చేస్తూ ప్రజల్లో ఒకడిగా తిరిగారని, అందుకే ఆయనపై ప్రజలకి నమ్మకం, విశ్వాసం కలిగాయని వ్యక్తం చేశారు. అందరి ఆశీస్సులతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలిచి, జగన్ సీఎం అయితే మంచిదే అన్నారు రోశయ్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *