రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక వార్త ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ని కేంద్ర ఎన్నికల సంఘం పిలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజుల క్రితం ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ఎన్నికల సంఘం. ఇప్పుడు డీజీపీని పిలవడంతో విశేషం సంతరించుకుంది.
ఠాకూర్ మధ్యాహ్నం ఒంటి గంటకు సీఈసీని కలవనున్నారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆర్పీ ఠాకూర్ తో పాటు పలువురు పోలీసు అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ఠాకూర్ నుండి సీఈసీ వివరాలు సేకరించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
వైసీపీ శ్రేణులు ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులు
1 . జగన్ పై ఎయిర్పోర్టులో జరిగిన దాడి వ్యవహారంలో ఆర్పీ ఠాకూర్ తన బాధ్యతలు మరచి మీడియా ముందుకు చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యవహారశైలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.
2 . డీజీపీ ఠాకూర్ పక్షపాత ధోరణితో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఫిర్యాదు.
3 . శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వివేకానందరెడ్డికి సరైన రక్షణ కల్పించకపోవడం వలనే ఆయన హత్యకు గురి అయ్యారంటూ ఆరోపణ.
4 . పోలీసు అధికారుల పదోన్నతి విషయంలో కూడా అవకతవకలు జరిగాయంటూ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరొక ఫిర్యాదును సమర్పించారు వైసీపీ శ్రేణులు.
వీటిపై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను సీఈసీ వివరణ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేవలం డీజీపీని మాత్రమే సీఈసీ పిలిచిందా లేక మరెవరైనా అధికారులు కూడా ఢిల్లీ వెళ్లనున్నారా అనే సమాచారం తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/nizamabad-farmer-candidates-move-to-high-court/