అక్టోబర్ 21న హుజూర్ నగర్ ఉప ఎన్నిక

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన హుజుర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి అక్టోబర్‌ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరా ప్రకటించారు.
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన సందర్భంగా సునీల్‌ ఆరోరా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఉప ఎన్నికకు సెప్టెంబర్‌ 27న నోటిఫికేషన్‌ విడుదల కానుంది.
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్‌ 4. ఇక పోలింగ్‌ ప్రక్రియ అక్టోబర్‌ 21న, ఓట్ల లెక్కింపు 24న నిర్వహించనున్నారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ నాయకుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నల్లగొండ ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. తదనంతరం హుజుర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉత్తమ్‌ రాజీనామా చేశారు. దీంతో హుజుర్‌నగర్‌ స్థానం ఖాళీ అయింది. ఈ క్రమంలో అక్టోబర్‌ 21వ తేదీన హుజుర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.