జాతీయ రాజకీయాల్లో చంద్రబాబే ఎందుకు చురుగ్గా ఉన్నారు?

(రమేష్ కుమార్ పూసల)

తెలుగు ముఖ్యమంత్రులిద్దరు జాతీయ రాజకీయాల దిశ మార్చేందుకు పోటీ పడుతున్నారు.అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ స్థాయిలో రెండుడుగల ముందున్నట్లు అర్థమవుతున్నది.

దీనికి కారణం వాళ్లు తీసుకున్నపొలిటికల్  లైనే.

కెసియార్ లైన్ లో స్పష్టత కనిపించదు.ఆయన చాలా గోప్యత పాటిస్తున్నారు. దానికితోడు ఆయన మీద బిజెపి బి టీమ్ అని ముద్ర ఉంది. పైకి ఆయన కాంగ్రెసేతర, బిజెపియేతర కూటమి ఫెడరల్ ఫ్రంట్ కట్టేందుకే పార్టీ నేతలను కలుస్తున్నానని చెబుతునన్నారు.

మరొక వైపు ఇండియన్ ఎక్స్ ప్రెస్ వంటి జాతీయ పత్రికలు కెసిఆర్ కాంగ్రెస్ వైపు రావాలని ప్రయత్నిస్తున్నారని, కాంగ్రెస్కు టిఆర్ ఎస్ కు మధ్య రాజీ కుదుర్చాలని ఆయన కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో ఫోన్ లో మాట్లాడినట్లు  రాస్తున్నాయి.

దీనితో కెసియార్ ఇమేజ్ జాతీయ స్థాయిలో దెబ్బతినే అవకాశం ఉంది. నిజానికి ఆయనతో కలవాలన్న ఉత్సాహం చూపే ప్రాంతీయ పార్టీలు కనిపించడం లేదు.

దేశంలో రాజకీయ పార్టీలు బిజెపి అనుకూల, బిజెపి వ్యతిరేక పార్టీలుగా పార్గీలుగా విడిపోయాయి. అందువల్ల కాంగ్రెస్ వ్యతిరేక, బిజెపి వ్యతిరేక పార్టీలు లేవు. రాష్ట్రాలలో కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్నప్పటికీ జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా చాలా పార్టీలు కలవాలనుకుంటున్నాయి. దానికితోడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా తాను ప్రధాన మంత్రి రేసులో లేనని కూడా ప్రకటించారు.

కెసియార్ కలిసిన వాళ్లనే మళ్లీ మళ్లీ కలుస్తున్నారు. కొత్త వాళ్లెవరూ ఆయన జాబితాలోకెక్కినట్లు లేరు.  ఆందుకే  ఆయన ఫెడరల్ ఫ్రంటుకి కొత్తదనం రావడం లేదు.  అంత గా ముందుకు సాగుతున్నట్లు కనిపించదు.

ఇక చంద్రబాబు విషయానికి వస్తే, ఆయన క్లారిటీ ఆయన్ను ముందుకు తీసుకువెళుతున్నట్లుకనిపిస్తుంది. ఆయన మోదీ వ్యతిరేక లైన్ తీసుకున్నాడు. దాని మీద నిలబడ్డారు. ఉత్తరాది అన్ని పార్టీ లు ఆయన కు చాలా ప్రాముఖ్యం ఇస్తున్నాయి. ఆయన మాటకు చాలా వెయిట్ ఇస్తున్నాయి.

కెసియార్ దక్షిణాది రాష్ట్రాలు తిరగుతుంటే చంద్రబాబు దేశమంతా తిరుగుతున్నారు. ఉత్తరాది పార్టీల మీద కెసియార్ అంత ఆసక్తి చూపడం లేదు.

మాయావతితో, బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ లతో కెసియార్ మాట్లాడనే లేదు. నితిష్ కు బిజెపి తో అంతమంచి సంబంధాలు లేవని అంతా చెబుతారు. అయినా ఆయనను కలిసే ప్రయత్నం కెసిఆర్ చేయడం లేదు.

కెసిఆర్ కలుస్తున్న వారంతా కాంగ్రెస్ మిత్రులే. కాకపోతే, సమాజ్ వాది పార్టీ అథినేత అఖిలేష్ తో ఆయన సంప్రదింపులు జరిపారు. అఖిలేష్ రాహుల్ గాంధీకి మంచి మిత్రుడు.బిజెపికి బద్ధశత్రువు. అందువల్ల ఆయన కెసిఆర్ ఫెడరల్ ప్రంటులో కలస్తాడన్నగ్యారంటీ లేదు.

అలాంటపుడు పదే పదే వారినే కలవడంలో కెసిఆర్ ప్లాన్ ఏమిటి?

జాతీయపత్రికలు రాస్తున్నట్లు ఆయన కూడా కాంగ్రెస్ కూటమిలోకి వెళ్లాలనుకుంటున్నారా? 40 సీట్లతో (జగన్ కు తో కలిపి )పార్లమెంటులో ప్రవేశించి చక్రం తిప్పానుకుంటున్న కూటమిలాగా కెసిఆర్ కదలికలు కనిపించడం లేదు. ఏదో గోప్యం, రహస్య ఎజండాతో ఉన్నట్లు కనిపిస్తుంది. జగన్ కెసియార్ లు కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తే వారితో ఉంటారని కొంతమంది మంది రాజకీయ పండితులు అనుమానిస్తున్నారు.

ఇటువైపు జాతీయ స్థాయిలో ఒక కూటమి కట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చాలా ముందుకు పోయాయి. 1996 పునరావృతమవుతున్నట్లనిపిస్తుంది.అపుడుకూడా టిడిపి దగ్గిర నిలబడి కూటమి ఏర్పాటయ్యేందుకు కృషి చేసింది. అపుడుచంద్రబాబే కీలక పాత్ర పోషించారు.

ఎన్నికల ముందే ఒక కూటమి ఏర్పడాలని ఆయన  ప్రతిపాదించారు. దానిని పరిశీలించేందుకు 2 జాతీయపార్టీలు ఈనెల  21న  సమావేవమవుతున్నాయి. వేర్వేరుగానే పార్టీలన్నీ ఎన్నికల్లో ప్రత్యర్థులతో తలపడినా, అంతా బిజెపి వ్యతిరేకులే. దానికితోడు బిజెపికి గతంలో వచ్చే దానికంటే ఈ సారి కనీసం వందసీట్లు తగ్గాతాయని, ఒక్క ఉత్తరప్రదేశ్లో నే 40 సీట్ల దాకా తగ్గుతాయని అంటున్నారు. అందువల్ల ఎన్నికల ముందే ఒక కూటమి ఏర్పాటు చేసేందుకు దోహదపడే ఉమ్మడి అంశాలను పరిశీలించేందుకు ఈ సమావేశం ఏర్పాటవుతూ ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు వోడిపోతున్నాడని, వైసిసి అధినేత జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడని చాలా మంది నమ్ముతున్నారు. దాదాపు సర్వేలన్నీఇదే విషయాన్ని చెప్పాయి. జగన్ ముఖ్యమంత్రి అయితే, కొంత కీర్తి కెసియార్ కు దక్కుతుంది.రాష్టంలో ఇలాంటి పరిస్థితి ఉన్నా జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడిని ఎవరూఅంత ఈజీగా తీసిపారేయడం లేదు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత శరద్ యాదవ్ ఆయనను ప్రధాని అభ్యర్థిగా యోగ్యుడని చెప్పాడు. జాతీయ మీడియా ప్రతిపాదిస్తున్న ప్రధాని అభ్యర్థులలో మాయావతి, మమతాబెనర్జీ తర్వాత వినిపిస్తున్న పేరు చంద్రబాబుదే. ఇది ఆయనకు జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు ఏమిటో చెబుతుంది.

చంద్రబాబు నిజాయితీని రాహుల్ శంకిస్తున్నట్లు కనిపించదు. ఎందుకంటే దాదాపు మూడున్నరశాబ్దాలు పాటు కాంగ్రెస్ ను వ్యతిరేకించిన పార్టీ తన తో స్నేహానికి వస్తే ఎవరైనా అనుమానిస్తారు. అంతతొందరగా పాత విషయాలుమర్చిపోలేరు. అయితే, రాహుల్-చంద్రబాబులు బాగా సన్నిహితమయ్యారు. చంద్రబాబు అనుభవాన్నిఆయన గౌరవిస్తున్నట్లు అర్థమవుతుంది. వీళ్లిద్దరి మధ్య ఉన్న అవగాహన చూస్తే, రేపు ప్రాంతీయ పార్టీల అభ్యర్థిని ప్రధానిగా నిలబెట్టాల్సి వస్తే, రాహుల్ గాంధీ చంద్రబాబుకు మద్దతు నిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాయావతి, మమతా, చంద్రబాబుల పేర్లు పరిశీలనకు వస్తే,చాలా పార్టీలు చంద్రబాబును ఒకె చేయవచ్చు. రాష్ట్రంలో చంద్రబాబు ఓడిపోయినా, ఆయన జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించే విషయంలో మార్పు ఉండదు.

 

(రచయిత ఒక రీసెర్చ్ స్కాలర్, ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయలు ఆయన వ్యక్తిగతం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *