శ్రీశైలం ప్రాజెక్టు ముప్పు సమస్యకు పరిష్కారమేమిటి?

(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)
శ్రీశైలం ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉందని. జాగ్రత్తలు తీసుకోకపోతే భారీ మూల్యం తప్పదని వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ హెచ్చరించడంతో ప్రాజెక్టు భద్రతపై మరో మారు చర్చకు దారితీస్తుంది.
శ్రీశైలం ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉన్నదా ?
శ్రీశైలం డ్యామ్ నిర్వహణలో గత ప్రభుత్వాల అలసత్వం కారణంగా ముప్పు ఏర్పడిందని చెప్పక తప్పదు. డ్యామ్ అవుట్ ప్లో సామర్థ్యం 19.5 లక్షల క్కుసెక్వ్యూలు. 2009 న వచ్చిన వరద కారణంగా 25.5 లక్షల క్కుసెక్వ్యూల నీరు విడుదల చేశారు. ఫలితంగా ప్లంజ్ పూల్ దెబ్బతిన్నది. ప్రతి 1 లేదా 2 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వ సారథ్యంలోని
” ఎక్స్పర్ట్ ఆప్ డ్యామ్ సేఫ్టీ ” వ్రాత పూర్వక నివేదికలు ఇస్తూనే ఉన్నా వాటిని పట్టించుకునే ఓపిక పాలకులకు లేకపోవడంతో నేడు ప్రమాద పరిస్థితి నెలకొంది. మరో వైపు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం రోజు రోజుకు తగ్గి ప్రవాహం వత్తిడికి డ్యామ్ గురి అవుతుంది. డ్యామ్ కు జరగరాని నష్టం జరిగితే దిగువన ఉన్న నాగార్జున సాగర్ జలాశయం ప్రమాదంలో పడుతుంది. సాగర్ దిగువ ప్రాంతం , కృష్ణా డెల్టా , అమరావతి , విజయవాడ పరిసర ప్రాంతాలు తీవ్ర ప్రమాద పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
నిపుణుల కమిటీ సిపార్సులు అమలుచేయాలి
దేశంలోని భారీ , చిన్న తరహా ప్రాజెక్టుల నిర్మాణాలను పరిశీలించి ” ఎక్స్పర్ట్ ఆప్ డ్యామ్ సెక్కురిటీ ” తగిన సిపార్సులు చేస్తుంది. దురదృష్టవశాత్తు పాలకులు భారీ మొత్తంలో ఆర్థిక ప్రయోజనం కోసం కొత్త నిర్మాణాల వైపు అడుగులు వేస్తున్నారు. కానీ అందుబాటులో ఉన్న డ్యామ్ ల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం లేదు. 10 సంవత్సరాల క్రితం డ్యామ్ ప్లంజ్ పూల్ కు జరిగిన నష్టనివారణకు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడాన్ని ఏమనాలి.
వత్తిడి తగ్గించడం కీలకం
ప్లంజ్ పూల్ కు జరిగిన నష్టాన్ని పరిష్కరించినా డ్యామ్ కు ప్రమాదం పూర్తిగా తొలిగిపోదు. శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించినపుడు నిల్వ సామర్థ్యం 308 టీఎంసీలు. నేడు పూడిక వలన 205 టీఎంసీలకు పడిపోయింది. అంటే 100 టీఎంసీలు తగ్గింది. నిల్వ సామర్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నీటిని విడుదల చేసే ఏర్పాటు కలిపి డ్యామ్ నిర్మాణం చేస్తారు. నిల్వ సామర్థ్యం తగ్గడం వలన వరద ప్రవాహం డ్యామ్ పై ఎక్కువగా ఉంటుంది. మును ముందు ఈ సమస్య పెరుగుతుంది. కనుక డ్యామ్ పై ఒత్తిడి తగ్గించే చర్యలు తీసుకోవాలి.
1. సిద్దేశ్వరం
శ్రీశైలం పై భాగములో 80 కిలోమీటర్ల దూరంలో 860 అడుగుల ఎత్తు లో సిద్దేశ్వరం నిర్మాణం కీలక పరిస్కారం అవుతుంది. దీని సామర్ధ్యం 50 టీఎంసీలు. సిద్దేశ్వరం వలన రాయలసీమకు గ్రావిటితో నీరు విడుదలకు అవకాశం ఉంటుంది. శ్రీశైలం డ్యామ్ పై ఒత్తిడి తగ్గుతుంది.
2. తుంగభద్ర నీటిని రాయలసీమకు మల్లించాలి
తుంగభద్ర నీటి ప్రవాహం కూడా కృష్ణలో కలుస్తుంది. కర్నాటక ప్రభుత్వం టిబి డ్యామ్ ఎడమ వైపు స్పిల్వే నిర్మాణం చేయాలన్న ప్రతిపాదన చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కుడివైపు నిర్మాణం చేసి 50 వేల క్కుసెక్వ్యూల నీటిని సమాంతర కాల్వకు విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలి. కర్ణాటక , రాయలసీమ సరిహద్దు మెలగనూరు నుంచి మరియు గుండ్రేవుల నిర్మాణం పూర్తి చేసి 25 టీఎంసీల నిల్వ చేసుకోవడం ద్వారా SRMC కి రెండు వైపుల నుంచి 50 వేల క్కుసెక్వ్యూల నీటిని సరఫరా చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ నిర్మాణాల వలన రాయలసీమ నీటి సమస్య పరిష్కారం కావడంతో బాటు శ్రీశైలం డ్యామ్ పై ఒత్తిడి తగ్గి డ్యామ్ ముప్పు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
అనేక సంవత్సరాలుగా రాయలసీమ ఉద్యమం ఈ మాటలు చెపుతున్నా పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆచరణకు నోచుకోలేదు. నేడు వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ చేసిన ప్రకటనను దృష్టిలో ఉంచుకుని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వంపై ఆలోచన పరులు , బాధ్యత కలిగిన వ్యక్తులు , సంస్థలు , ముక్యంగా మీడియా ఒత్తిడి తీసుకురావాల.

(మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి, కన్వీనర్ రాయలసీమ విద్యావంతుల వేదిక)