ఆంధ్ర సిఎస్ బదిలీ: ఎల్వీది స్వయంకృతాపరాధం, ప్రభుత్వానిది తొందరపాటు

(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)
అనూహ్య నిర్ణయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ. కారణాలపై పలువాదనలు వినిపిస్తున్నాయి. స్థూలంగా చూచినప్పుడు ఎల్వీ ది స్వయంకృపరాదంగా కనిపిస్తుంటే ప్రభుత్వ చర్య తొందరపాటు నిర్ణయంగా కనిపిస్తుంది.
ఎల్వీ ది స్వయంకృపరాదం ఎందుకంటే-
బదిలీ విషయంలో నేడు వినిపిస్తున్న మాట ముఖ్యమంత్రి చూచన మేరకు పొలిటికల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉన్నతాధికారుల బదిలీలు చేసినారు  అని.
సాధారణంగా ప్రధాన కార్యదర్శి పేరుతో జరిగే పని ఆయన కన్నా తక్కువ హోదా అధికారి పేరుతో జరిగింది.
తనకు సమాచారం లేకుండా నిర్ణయం తీసుకున్న ప్రవీణ్ కు ఎల్వీ నోటీసు ఇచ్చినారు.
ముఖ్యమంత్రి రాష్ట్రానికి గవర్నర్ తరఫున అధిపతి. రాజ్యాంగ , చట్టానికి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలను మినహా మిగతా అంశాలలో ముఖ్యమంత్రి నిర్ణయాలను ప్రధాన కార్యదర్శి ప్రశ్నించలేరు.
బదిలీలు అన్నది ముఖ్యమంత్రి విచక్షణకు సంబంధించిన విషయం.
కారణం ఏమైనా తనకన్నా క్రింద స్థాయి అధికారి ప్రవీణ్ ప్రకాష్ కు కొంత మంది అధికారులను బదిలీ చేయమని ముఖ్యమంత్రి ఆదేశించారు. వారు అమలు చేశారు.
ఈ సమయంలో ఎల్వీ చేయాల్సింది నేరుగా ముఖ్యమంత్రికి తన అభ్యంతరాన్ని తెలపడం. ఎందుకంటే ముఖ్యమంత్రి సలహా మేరకు ప్రవీణ్ బదిలీలు చేశారు.
అందుకు భిన్నంగా ఎల్వీ ప్రవీణ్ కు నోటీసు ఇచ్చినారు. ఒకరకంగా ఇది ముఖ్యమంత్రికే నోటీసు ఇచ్చినట్లు అయినది.
ఈ సమయంలో ముఖ్యమంత్రి ఇపుడు ఎల్వి చర్యలపై మౌనం వహిస్తే పాలనలో ధిక్కార స్వరాలు వస్తాయి.
ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించిన విషయం తెలిసి కూడా తన కన్నా తక్కువ స్థాయి అన్న కోణంలో ప్రవీణ్ ప్రకాష్ కు నోటీసు ఇవ్వడం కారణంగా నేడు ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ కావడం స్వయంకృపరాదం అనక తప్పదు.
ప్రభుత్వ నిర్ణయం కూడా తొందరపాటే. ఎందుకంటే…
అదే సమయంలో ఎల్వీసుబ్రహ్మణ్యం ఎంపిక , బదిలీ విషయంలో ప్రభుత్వం తొందరపడింది అని చెప్పక తప్పదు.
ప్రధాన కార్యదర్శిని బదిలీ , ఎంపిక చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నది.
కానీ తన తర్వాత ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడం , పర్యవేక్షణ చేయడం ప్రధాన కార్యదర్శి చేస్తారు.
అంతటి కీలక అధికారిని నియమించేటప్పుడు తన ఆలోచనలు , ప్రాధాన్యతలను అమలు చేయడం ముఖ్యంగా తన మనసెరిగిన వ్యక్తిని ఎంపిక చేయడం జరగాలి.
బదిలీ చేసే అవకాశం ఉన్నా ప్రధాన కార్యదర్శిని బదిలీ చేయడం సాధారణంగా జరగదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల సమయంలో నియమించిన ఎల్వీ స్థానంలో కొత్త ప్రభుత్వం తనకు కావాల్సిన అధికారిని నియమించుకునే అవకాశం ఉన్నా ఎల్వినే ఎంపిక చేశారు.
ఎల్వీ ఎంపికను తీవ్రంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యతిరేకించారు. బాబు మీద ఉన్న కోపంతో నాడు ఎల్వీని బలపరిచి అధికారంలోకి వచ్చిన తర్వాత వారినే కొనసాగించారు.
మరో కొద్దినెలల్లో పదవీవిరమణ చేయబోయే ముందు బదిలీ చేసి విమర్శలు కొని తెచ్చుకున్నారు. అధికారుల బదిలీలను సాంప్రదాయానికి భిన్నంగా ముఖ్యమంత్రి పొలిటికల్ కార్యదర్శికి అప్పగించారు.
ఈ చర్యలతో ప్రధాన  కార్యదర్శికి ముఖ్యమంత్రి మధ్య ఉన్న అగాదాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాంటి సమయంలో వెంటనే ప్రధాన కార్యదర్శిని బదిలీ చేసి ఉండాలి.
అందుకు భిన్నంగా అధికారం ఉన్నా సాంప్రదాయాలకు భిన్నంగా కార్యదర్శిని పక్కన పెట్టి వారికన్నా తక్కువ స్థాయి అధికారితో బిజినెస్ రూల్సులో మార్పులు , అధికారుల బదిలీలు చేయడం.
అందుకు ప్రతిగా ఎల్వీ, ప్రవీణ్ కి నోటీసు ఇవ్వడం ఫలితంగా సాధారణంగా జరగని విధంగా కార్యదర్శిని బదిలీ చేసి విమర్శలు తెచ్చుకోవడం అధికార పార్టీ తొందరపాటు నిర్ణయాలతో కొని తెచ్చుకొన్న సమస్యలు అని చెప్పక తప్పదు.