అమరావతి రాజధాని ఒక ఖరీదైన భ్రమ: మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి

(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజదానుల ప్రతిపాదన చేసినప్పుడు నుంచి అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేపట్టారు. మరో వైపు సీమకు హైకోర్టు , ఉత్తరాంధ్రకు సచివాలయం ప్రతిపాదనతో తమ ప్రాంతానికి కొంతయినా ప్రయోజనం కలుగపోతుందా అన్న ఆశతో ఇక్కడి ప్రజలు ఉన్నారు. ఉత్తరాంధ్ర , రాయలసీమ ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండు చేస్తున్నాయి.
అమరావతి కల ఖరీదైన భ్రమ
అమరావతి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక , ఉపాధి , పాలనా కేంద్రంగా మారబోతోన్నదని గత ప్రభుత్వం తాను కలగంటు ప్రజలను బ్రమలలో ఉంచింది. పైపెచ్చు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా రాజధాని నిర్మానాణానికి అవసరం అయ్యే ఖర్చును భూములు అమ్మడం ద్వారా సమకూర్చుకోగళం అని అంచనా వేశారు. మొత్తం రైతుల నుంచి 34 వేల ఎకరాల భూమి , ఇతర ప్రభుత్వ భూములు కలుపుకుని 52 వేల ఎకరాలలో రాజధానిని డిజైన్ చేసినారు. రైతుల వాటా , ప్రభుత్వ అవసరాలు పోను 10 వేల ఎకరాలు భూమిని అమ్మడం ద్వారా ఒక లక్ష కోట్లు వస్తుందని దానితో నిర్మాణం అంటూ భ్రమ కల్పిస్తున్నారు. రైతుల వాటా , భూముల అమ్మకం జరగాలంటే ప్రాథమిక ఏర్పాట్లు పూర్తి చేయాలి. గత ప్రభుత్వం అంచనా మేరకు భూముల అభివృద్ధి , కనీస సౌకర్యాలు ఏర్పాటుకు 50 నుంచి 70 వేల కోట్లు ఖర్చు అవుతుంది అని కేంద్రానికి నివేదిక సమర్పించారు. అంటే భూముల అమ్మకం జరగక ముందే 70 వేల కోట్ల రూపాయలు వెచ్చించాలి. ఆ తర్వాత భూములకు ధరలు రావాలంటే అక్కడ రాజధాని నిర్మాణం చేయాలి అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చాలి. వాస్తవాలు ఇలా ఉంటే అదేదో రాజధాని నిర్మాణం కోసం నిధులను అదే సమకూర్చుకుంటుంది అంటూ ఖరీదైన భ్రమను కల్పించారు

అమరావతి కల సాకారం కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు !
అమరావతి రైతులు త్యాగం అంటూ వారు భూములు ఇచ్చింది వారి ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్రం కోసం అంటూ విచిత్ర వాదనలు తెస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం , రైతులకు ఇవ్వాల్సిన భూమి పోను మిగిలిన భూమి10 నుంచి 15 వేల ఎకరాలు దాకా ఉంటుంది. అందులో గత ప్రభుత్వం ప్రయివేటు , విదేశీ సంస్థలకు ఇచ్చినపుడు తెలపని అభ్యంతరం నేడు 5 వేల ఎకరాలలో విజయవాడ , గుంటూరు పేదలకు ఇళ్ల స్థలాలు అంటే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కారణం అక్కడ పేదల ఇల్లు ఉంటే తమ ప్లాట్లకు మంచి మార్కెట్ ఉండదనే బెంగ మాత్రమే. అంటే రాజాధాని భూముల త్యాగాల వెనక ఉన్న రహస్యం భారీ ఆదాయ అంచనా మాత్రామే.
అమరావతిలో రాజధాని నిర్మాణం చేస్తే బంగారు గుడ్లు , ఇతర ప్రాంతాల్లో పెడితే రెండు టీ సాపులు మాత్రమేనా?
మూడు రాజదానుల ప్రతిపాదనలో భాగంగా కర్నూలుకు హైకోర్టు అనగానే హైకోర్టు ఇస్తే రాయలసీమ అభివృద్ధి జరుగుతుందా ? ఏమి వస్తుంది రెండు టీ , జిరాక్స్ సెంటర్లు తప్ప ఒక సచివాలయం విశాఖలో పెడితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిపోతుందా ? అంటూ విచిత్ర వాదనలు వినిపిస్తున్న అమరావతి ఉద్యమ నేతలు అలాంటి జిరాక్స్ సెంటర్ల కోసం ఎందుకు ఆందోళనలు చేపట్టారు. అలాంటి సంస్థలు అమరావతిలో నిర్మాణం చేస్తే బంగారు గుడ్లు పెడుతుంది అంటూ ఎలా చెపుతారు. అంటే రాజధానికి అర్హత కలిగింది కేవలం అమరావతి ప్రాంతం మాత్రమేనా. ఏ కోణం నుంచి చూసినా నూతన నగరం అమరావతిలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం అత్యంత వ్యయప్రయసలతో కూడుకున్నది. అలాంటి ఖర్చుతో కూడుకున్న ప్రయత్నం పరిమిత వనరులు కలిగిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి భారంగా మారడం అనివార్యం. తీవ్ర కరువు , నీటి సమస్యతో వెనుకబడిన రాయలసీమ , ఉత్తరాంధ్రకు నేడు కావాల్సింది మరో కొత్త నగరంతో కూడిన రాజధాని నిర్మాణం కాదు. ఉన్న పరిమిత వనరులతో నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం ప్రాథమిక అవసరం. రాయలసీమకు హైకోర్టుతో బాటు నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం , తిరుపతి హిందూపురం నగరాలను ఐటీ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి.

ఖరీదైన భ్రమ అమరావతి కల సాకారం కోసం కాకుండా. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేసే నీటి ప్రాజెక్టుల నిర్మాణం వైపు అడుగులు వేసి నిర్ణయాల కోసం ప్రభుత్వం పై సీమ విద్యార్థులు ఒత్తిడి తీసుకురావాలని పురుషోత్తమ రెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహిళా నేత సుమతి ప్రసంగించారు. పెద్ద సంఖ్యలో నర్సింగ్ , పిజియో తెరఫీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
(స్విమ్స్ పద్మావతి ఆడిటోరియంలో మూడు రాజదానుల పై జరిగిన సదస్సులో చేసిన ప్రసంగం)