ఎగ్జిట్ పోల్స్ లోపాలు – బిజెపి గెలుపు అనుమానమంటున్న మాకిరెడ్డి

(మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి)
దేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాల ముందు ఎగ్జిట్ పోల్స్ పేరుతో జాతీయ చానల్స్ తమ అంచనాలను ప్రకటించాయి. దాదాపు అన్ని బిజెపికి అనుకూలంగా ఉన్నాయి. 2014 ఫలితాలు దాదాపు పునరావృతం కాబోతున్నట్లు చెప్పారు. నిజానికి ఈ అంచనాలలో పారదర్సకత లోపించినట్లు కనిపిస్తుంది.
2014 నాటి పరిస్థితి…
నాడు కాంగ్రెస్ 10 సంవత్సరాల పాలనపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ నాయకత్వంపై ఆశలు పెరిగాయి. నాడు ప్రాంతీయ పార్టీలు కొన్ని బలంగా ఉన్నా జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపలేక పోయాయి. అలాంటి సమయంలో మోదీ నాయకత్వంలో బిజెపి విజయం సాధించింది. అంతటి విజయంలో కూడా వారికి లభించిన 270 పైచిలుకు స్థానాలలో దాదాపు 200 సీట్లు కేవలం10 రాష్ట్రాలలో మాత్రమే. అంతటి సానుకూల పరిస్థితిలోనూ మిగిలిన దేశంలో అది సాధించిన సీట్లు 70 మాత్రమే. నేడు కాంగ్రెస్ మీద అభిమానం లేక పోయినా నాటి వ్యతిరేకత లేదు. మరో వైపు ప్రాంతీయ పార్టీలు నేడు జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. దాని కారణంగా బెంగాల్ , యూపీ లలో మమత బెనర్జీ , మాయావతి లకు సీట్లు పెరుగుతాయి. ముఖ్యంగా2014 లాగా మోదీ నాయకత్వంపై అనుకూల వాతావరణం లేక పొగ అనేక కారణాల వల్ల చెప్పుకోదగ్గ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
2014లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిన బీహార్ , మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ గఢ్, పంజాబ్ లలో నాటి నుంచి నేటి వరకు వరుస ఎన్నికలలో ప్రతికూల ఫలితాలను బిజెపి చవి చూసింది. ఈ రాష్ట్రాల్లో సీట్లు 78 అందులో బిజెపికి దాదాపు 60 సీట్లు దక్కాయి.
బీజేపీ విజయానికి కీలకమైన యూపీలో 80లో బిజెపి70 సీట్లు పైనే సాధించింది. ఈ రాష్ట్రంలో ఎస్పీ బిఎస్పీ పార్టీలు విడి విడిగా పోటీచేస్తే  పలితం మరోలాగా ఉంటుంది. ఈసారి కలిసి పోటీ చేసినారు. కొత్తగా బిజెపి లాభపడింది అన్న అంచనా ఉన్న రాష్ట్రాలు బెంగాల్ , కేరళ వాటిలో అంచనాల కనుగుణంగా పలితం రావడానికి పరిమితులు ఉన్నాయి.
మారిన పరిస్థితులు చూస్తుంటే బిజెపికి అనుకూల వాతావరణం లేదని అనిపిస్తుంది.
కానీ జాతీయ చానల్స్ మాత్రం పరిస్థితులను ఏ మాత్రం పరిగణలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు. మోదీకి 2014 నాటి సానుకూల పరిస్థితులు లేకున్నా, గతంలో మంచి ఫలితాలు సాధించిన రాష్ట్రలలో వరుస ప్రతికూల ఫలితాలు చెవిచూసినా కూడా ఆ రాష్ట్రాల్లో గడిచిన ఫలితాలే పునరావృతం అవుతాయని జాతీయ చానల్స్ అంచనాలు వేయడం , కొన్ని నెలల క్రితమే రాజస్తాన్ , మధ్యప్రదేశ్ , చత్తీస్ గడ్ లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికి నేడు ఆ పార్టీకి కనీస సీట్లు కూడా రావు ఆనడం ద్వారా వాటి పారదర్సకత లోపించినట్లుగా చెప్పక తప్పదు.
కాంగ్రెస్ బలహీనంగా ఉండటం వలన ప్రతికూల ప్రభావం ఉన్నా బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించడం సహజం. అది 150 , 170 , 200 అన్నది చూడాలి. మొదటి రెండు ఫలితాలు వస్తే 2019లో కేంద్రం ప్రభుత్వం ఏర్పాటులో వారి పాత్ర ఉండదు. 200 సీట్లు పరిధిలోకి వస్తే బిజెపి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. నా అంచనా మాత్రం బిజెపి ఒంటరిగా అధికారంలోకి రావడం సాధ్యం కాక పోవచ్చు….
(మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *