తెలంగాణలో రాజుకుంటున్న ఉత్తర దక్షిణ చిచ్చు

తెలంగాణలో ప్రాంతీయ అసమానతలు పొడసూపుతున్నాయా? రాష్ట్రమంతా ఒకే రకమైన పరిపాలన సాగించాల్సిన పాలకులే వివక్ష చూపిస్తున్నారా? ఉత్తర తెలంగాణలో ఒక తీరుగా, దక్షిణ తెలంగాణలో ఒక తీరుగా పాలన సాగుతున్నదా? సిఎం సొంత జిల్లాలో బాధితులకు దక్కుతున్న న్యాయం వేరే జిల్లాల్లో దక్కడం లేదా? ఈ పరిణామాలపై ట్రెండింగ్ తెలుగు న్యూస్ కథనం చదవండి.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో అన్యాయం జరుగుతుందని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అటువంటి పాలనే దాపురించింది. ఈ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదాల సంఘటనలలో తెలంగాణ ప్రభుత్వం చెల్లించిన పరిహారం విషయంలో వివాదం రాజుకుంటున్నది. తెలంగాణలో ఈ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదాలలో అనేక మంది మరణించారు. కరీంనగర్, సిద్దిపేట, మెదక్, ఇబ్రహీంపట్నం, యాదాద్రి జిల్లాలో నెల రోజుల వ్యవధిలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో నలభై మంది వరకు జనాలు బలయ్యారు. వారి కుటుంబాలకు అండగా ఉండి ఆదుకోవాల్సిన ప్రభుత్వం వివక్ష చూపిస్తోందన్న వమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం సొంత జిల్లా మెదక్ లజరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన వారికి భారీగా పరిహారం చెల్లిస్తున్నారు. అయితే ఇతర జిల్లాలలో మృతి చెందిన వారికి  తక్కువ పరిహారం ఇస్తున్నారు. ప్రాంతీయ అసమానత కారణంగానే తెలంగాణ ఉద్యమం పుట్టింది. రాష్ట్రం వచ్చింది. కానీ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రాంతీయ విబేధాలు, వివక్షలు మొదలయ్యాయని చర్చ జరుగుతున్నది.

ఇటీవల కాలంలో సిద్దిపేట, కరీంనగర్‌ జిల్లాలలో జరిగిన ప్రమాదాలలో మరణించిన బాధిత కుటుంబాల వారికి 5 లక్షల రూపాయలు పరిహారం అందించారు. అదే యాదాద్రి భువనగిరి జిల్లాలో, ఇబ్రహీంపట్నంలో జరిగిన ప్రమాదాలలో మృతి చెందిన వారికి కేవలం రూ.2లక్షలు పరిహారం మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకున్నారు. జిల్లాల మధ్య ఇంతటి వివక్షేంటని, వారివేనా ప్రాణాలు, మావి కావా అని మృతుల కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. సిఎం జిల్లాలో మరణించినవారికి ఒక తీరుగా, ఇతర జిల్లాల వారికి ఒకతీరుగా పరిహారం ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు.

మంత్రి స్థాయిలో ఉన్న జగదీష్ రెడ్డి మృతుల కుటుంబాలను ఆదుకుని, న్యాయం చేయాల్సింది పోయి ఆదుకోవాలని అడిగిన పాపానికి వారిపై రుసరుసలాడాడు. పరిహారం మరీ 2లక్షలే ఇస్తారా? 5 లక్షలు ఇవ్వాలి అని బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తే మంత్రి జగదీష్ రెడ్డి ‘‘50 లక్షలు సరిపోతాయా? ’’ అని అవమానించేలా మాట్లాడినట్లు బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగదీష్ రెడ్డి  శవరాజకీయాలు చేస్తున్నాడని బాధితులు మండిపడుతున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో 15 మంది వ్యవసాయ కూలీలు మరణించారు. వారంతా రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల వారే. చిన్నచిన్న పిల్లలు అమ్మ లేక అనాథలయ్యారు. వారి పిల్లలకు, కుటుంబ సభ్యులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం అలసత్వం వహించటంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంతో చర్చించి పరిహారం ఇప్పించాల్సిన జిల్లాలకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి 2లక్షలు ప్రకటించారు.

దక్షిణ తెలంగాణ జిల్లాలకు ప్రభుత్వం చూపుతున్న వివక్ష చాలా స్పష్టంగా ఉందని విపక్షాలు కూడా అంటున్నాయి. ప్రభుత్వం చూపుతున్న వివక్ష ప్రజలలో ఆగ్రహాన్ని తెప్పించిందని చెప్పవచ్చు. మరి ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *