నేనేందుకు పార్టీ వదిలేశానో తెలుసా: దేవినేని అవినాశ్ సుదీర్ఘ వివరణ

 తానెందుకు  తెలుగుదేశం పార్టీని వదిలేసి వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరాడో తెలుగు యువత అధ్యక్షుడు   దేవినేని అవినాష్  రాజీనామా లేఖలో వివరించారు. ఇదే వివరణ:
మా నాన్న గారు నాకు చిన్నప్పటి నుండి  ఒక మాట చెప్పేవారు ..
“మన వ్యక్తిగత జీవితాల కన్నా , మనల్ని నమ్ముకుని ఉండే మనుషులు  ముఖ్యం ..
వారి శ్రేయస్సు కోసం మనం  ఎలాంటి అడుగు అయినా తీసుకోక తప్పదు ” అని చెప్పారు .
“నేను ఎవరిని కించపరిచేలా కానీ , అవహేళన చేసేలా మాట్లాడే వ్యక్తిని కాదు “.
“నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడడం నా స్వభావం .”
  ఒక వ్యక్తి  నాయకుడు అవ్వాలంటే అది ప్రజలు కార్యకర్తలు అండతోనే సాధ్యం.
అదే నాయకుడు ఒక అడుగు వేశాడంటే అండగా ఉన్న కార్యకర్తలు ప్రజల శ్రేయస్సు కోసమే…
నాకు మీరు ఇచ్చిన బలం మీకే చెందుతుంది తప్ప ఎన్నడూ నా లాభాపేక్ష ఉండదు…
నాకు తెలిసింది నాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కమిట్మెంట్ తో  పనిచేయడమే…
ఒక అడుగు వేసేటప్పుడు ఎన్నో కారణాలు ఉంటాయి అదే విధంగా ఒక మాట అనేటప్పుడు అన్నీ ఆలోచించి అనాలి…
తెలుగుదేశం  పార్టీ .. కృష్ణా  జిల్లాలో  ఉన్న మా నాయకులను , కార్యకర్తలను వినియోగించడంలో విఫలం అయింది .
పార్టీ లో చేరినప్పటి నుండి “అధినాయకుడి మాటే .. నా బాట ” అని నిబద్ధతతో పని చేసాను .
 అదే విధంగా మా కార్యకర్తలకు , నాయకులకు సముచిత స్థానం కల్పించమని  చంద్రబాబు గారిని కోరాను .
నామీద నమ్మకంతో మీరు నాకు అప్పజెప్పిన ప్రతిబాధ్యతని నిజాయితీగా క్రమశిక్షణతో నిర్వహించాను.
ఎన్నికలలో నాకు అనువైన  స్థానం కాకపోయినా మీ ఆదేశాలమేరకు గుడివాడ నుండి పోటీచేశాను.
ఓటమి బాధ కలిగించినా లెక్కచేయకుండా పార్టీ కోసమే ముందడుగేసాను.
కానీ ఇన్నాళ్లు నా కష్టంలో నష్టంలో అనుక్షణం నావెన్నంటి ఉన్న కార్యకర్తలకు దేవినేని నెహ్రూగారి అనుచరులకు తగిన ప్రాధాన్యం దొరకకపోవడం బాధ కలిగించింది.
కొంతమంది లోకల్ నాయకులు కావాలనే ఇదంతా చేస్తున్నా అధిష్టానం పట్టించుకోకపోవడం కార్యకర్తలకు రుచించలేదు.
కానీ నా నిబద్ధత ను పార్టీ అధిష్ఠానం తేలికగా తీసుకుని , మా కార్యకర్తల మనోభావాలను  పరిగణలోకి తీసుకోకుండా వారికి ప్రాధాన్యం కలిగించడం లో పూర్తిగా విఫలం అయింది .
ఈ రోజు నేను కానీ, మా నాన్న గారు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రు గారు కానీయండి .. ఇలా ఉన్నాం అంటే అది కేవలం మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు , అభిమానుల వల్ల మాత్రమే .
అలాంటిది మా కార్యకర్తలకు ప్రాధాన్యం లేని చోట నేను ఉంటూ  ఆత్మవంచన చేసుకోలేను.
అలాగే పార్టీలో కమిట్మెంట్ తో పని చేసే వారికి ప్రాధాన్యం లేకపోవడం , పైగా భజన చేసే వారికి వత్తాసు పలకడం .. నా మనసును ఎంతో గాయపరిచాయి
పార్టీ మారే ఉద్దేశం లేదని నేను ఎన్ని విధాలుగా చెప్తున్నా ఎప్పటికప్పుడు నేను పార్టీ మారుతున్నానని వదంతులు పుట్టించి, అధిష్టాననానికి  నాగురించి తప్పుడు సంకేతాలు వెళ్లేలా చెయ్యడంలో సఫలం అయినవాళ్ళని ఇంకా చేరదీస్తూ ఉండడంతో మనసు విరిగిపోయింది.
పార్టీ నాకు అందించిన ప్రతి పనినీ బాధ్యతగా నిర్వర్తించాను, కానీ నేడు అసలు నా విషయంలో పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు నన్నే కాదు నా కార్యకర్తలు అనుచరులను కూడా అయోమయానికి గురిచేస్తున్నాయి.
మొన్న గుడివాడ ఇంచార్జి అన్నారు  ఈరోజు గన్నవరం అంటున్నారు .. రేపు ఇంకెక్కడో .. ఇలా ప్రతిసారీ నేను మారినా నా కార్యకర్తలు కూడా మారాలంటే ఎలా ?
స్థానికంగా బలపడుతున్న ప్రతీసారీ ఇలాంటి ఒడిదుడుకులు వస్తుంటే ఎక్కడ కుదురుకోవాలి ? ఎలా పార్టీని బలపరచాలి ?
అందుకే ..కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించిన మీదట .. పార్టీ వీడాలని నిర్ణయించుకున్నాను ..
నన్ను ఇంతకాలం ఆదరించిన చంద్రబాబు గారికి నా కృతఙ్ఞతలు. మీ మీద నాకున్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది
.