చంద్రబాబు వల్లే ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా: మంత్రి రంగనాథ రాజు

(రంగనాథ రాజు, ఎపి గృహనిర్మాణ మంత్రి)
రాష్ట్రంలో పేదలందరికి  ఇళ్లపట్టాల పంపిణి చేసే కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు  సైంధవ పాత్ర పోషిస్తున్నారు. పంపిణీకి 60వేల ఎకరాలు సిద్ధంగా ఉన్నాయి.అయితే, దీనిని కోర్టుల ద్వారా అడ్డుకుని 30 లక్షల మంది సేద కుటుంబాలకు ప్రతిపక్షనేత చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు
 నిజానికి ఈ నెల 8న, అంటే మహానేత వైఎస్ ఆర్  71వ జయంతి రోజున 30 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా ప్రభుత్వ, ప్రైవేటు భూములు కలిపి 60వేల ఎకరాల సేకరణ ద్వారా అడుగు వేశాం. ఇళ్ళ స్థలాలు రెడీగా ఉన్నాయి. ఇవ్వటానికి ప్రభుత్వం కూడా రెడీగా ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు, ఆయన అనుయాయులు ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు హైకోర్టుకు వెళ్ళారు. కొన్ని వందల రిట్‌ పిటిషన్లు దాఖలు చేయించారు.  అందులో ప్రధానంగా నాలుగు రిట్‌ పిటీషన్లుకు సంబంధించి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
వాటి ప్రకారం ఇళ్ళ పట్టాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేసేందుకు, రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాలిచ్చేందుకు వీలుగాని పరిస్థితి ఏర్పడింది.
దీన్ని మేం సుప్రీంకోర్టులో సవాల్‌ చేశాం. ఈ కోవిడ్‌ సమయంలో, సుప్రీంకోర్టుకు కూడా సెలవులు ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఆ స్టేలను తొలగించే పరిస్థితి లేదు కాబట్టి, అందుకు కొద్ది సమయం పడుతుంది. అవరోధాలన్నీ తొలగి ఆగస్టు 15 నాటికి రిజిస్ట్రేషన్‌ చేసి అక్కచెల్లెమ్మల చేతుల్లో ఈ 30 లక్షల ఇళ్ళ పట్టాలను వారికి ఇచ్చిన స్థలంలోనే వారికి అందజేస్తాం
 రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తామని మా పార్టీ అధ్యక్షుడు వైయస్‌ఆ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ఎన్నికలకు ముందు వాగ్దానం చేయటం జరిగింది. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు మొదటి ఏడాదిలోనే ఒక ఉద్యమంగా.. ఇందుకు సంబంధించి భూసేకరణను చేయటం జరిగింది.
–అటు ప్రభుత్వ భూముల్ని.. ఇటు ప్రైవేటు భూముల్ని కూడా ఇందుకు ఉపయోగించుకున్నాం. తద్వారా 25 లక్షలు మాత్రమే కాదు. మరో 5 లక్షల ఇళ్ళ పట్టాలు… మొత్తంగా 30లలక్షలకుపైగా ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు జగన్‌ గారి నేతృత్వంలో ఒక భారీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
 దేవతలు యజ్ఞం చేస్తుంటే.. రాక్షసులు భగ్నం చేసే ప్రయత్నం చేస్తారన్న పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన మనుషులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. అయినా వారి ఆటలు సాగవని తెలియజేస్తున్నాం.  పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారు చరిత్ర హీనులు కాక తప్పదని స్పష్టం చేస్తున్నాం.
 ప్రభుత్వ నిర్ణయంలో ఒక వజ్ర సంకల్పం ఉంది. అదే సమయంలో మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా అందరూ గమనించాలి. దీనికి అడ్డుపడుతున్నది ఎవరు..? ఎందుకు కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది? పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి చంద్రబాబు ఎందుకు అడ్డుపడుతున్నాడు? తన హయాంలో 2 లక్షల ఇళ్ళు కూడా కట్టించలేకపోయానన్న అవమానంతోనేనా?  లేక ఈ ప్రభుత్వ 30 లక్షల ఇళ్ళ పట్టాలు ఒకేసారి ఇస్తే.. ఇక తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయంతోనా.. అన్నది చెప్పాలి.
 మరోవంక ఈరోజు చంద్రబాబు నాయుడు చాలా విచిత్రమైన వాదన చేశారు. తన హయాంలో లక్షల ఇళ్ళు కట్టేశానంటున్నారు. ఎక్కడ కట్టారో ఆయనకే తెలియాలి..? నిజానికి వైయస్‌ఆర్‌ గారి హయాంలో కేవలం 5 ఏళ్ళ కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో 48 లక్షల ఇళ్ళ నిర్మాణం జరిగింది. అందులో దాదాపు 60 శాతం ఇళ్ళు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ లోని 13 జిల్లాల్లో కట్టినవే.
కానీ చంద్రబాబు 5 ఏళ్ళ హయాంలో మొదటి రెండేళ్ళలో ఇళ్ళ నిర్మాణం ఆపేశారు. ఆ తర్వాత మూడేళ్ళలో 2 లక్షల ఇళ్ళ నిర్మాణం కూడా జరిగింది లేదు.
ఇక టిడ్కో అంశానికి వద్దాం. టిడ్కో ఇళ్ళ నిర్మాణం పూర్తికాలేదు కానీ, పునాది పడక ముందే.. మీ ఫ్లాట్‌ ఫలానా చోట ఉంటుందంటూ.. నేల మీద నిలబెట్టి గహ ప్రవేశాలు చేయించేశారు. చంద్రబాబు నాయుడు కట్టిన ఇళ్ళు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదుగానీ, ఆయన పెట్టిన టిడ్కో బకాయిలు రూ. 3 వేల కోట్లు. హౌసింగ్‌ కు సంబంధించి ఇతర బకాయిలు మరో రూ. 1300 కోట్లు. మొత్తంగా రూ. 4,300 కోట్లు బాకీ పెట్టి దిగిపోయాడు. ఇవన్నీ నిజాలు కాదా?
మరొక విషయాన్ని కూడా చెబుతున్నాం. ఇంతటి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా, ఈ కోవిడ్‌ సమయంలో కూడా పేదల గహ నిర్మాణానికి 25 లక్షలు కాదు ఏకంగా 30 లక్షల ఇళ్ళ స్థలాలు సిద్ధం చేశాం. ఇదీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి.  ఆగస్టు 15 నాటికి రిజిస్ట్రేషన్లు చేసి ఇళ్ళ స్థలాల్ని.. ఈ 30 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో పట్టాలు పెడతామని మరోసారి స్పష్టం చేస్తున్నాం.
(ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందిన ప్రెస్ నోట్)