భారత్ సంపన్నుల జాబితా నుంచి మాయమైన అనిల్ అంబానీ

భారతదేశంలో సంపన్నులు సంపద గత ఏడాది బాగా తగ్గిపోయింది.
‘ ఐఐఎఫ్ ఎల్ హురున్ ఇండియా రిచ్ 2019’ రిపోర్టు ప్రకారం గత ఏడాది భారతీయ సంపన్నుల సంపద 11 శాతం తగ్గింది. షావుకార్ల సంపదను మొత్తంగా తీసుకుంటే రు.3,72,800 కోట్ల సంపద తగ్గింది.
తమాషా ఏమిటంటే, దేశంలో నెంబర్ వన్ రిచ్ అయిన రిలయన్స్ ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ సంపన్నుల జాబితా నుంచి మాయమయ్యారు.
సొంత వ్యాపార సామ్రాజ్యం నడుపుకుంటున్న అనిల్ కు 953 మంది సభ్యులున్న జాబితాలోచోటు దొరకలేదు.
 ఈ మధ్య అనిల్ అంబానీ కంపెనీలన్నీ అప్పులు కూడా చెల్లించలేని స్థితిలోకి వచ్చిన సంగతి తెలిసిందే. వాటికి డి గ్రేడ్ (Default Grade) లభించింది. అంబానీ ఒక కొడుకు ఇలా సంపన్నుల జాబితానుంచి జారుకోవడం  విచిత్రం.
ఈ ఏడాది సంపన్నుల జాబితా తీసుకుంటే, ఇందులో 344 మంది రాబడి గత ఏడాదితో పాలిస్తే తగ్గిపోయింది. మరొక 112 మంది జాబితా లోకెక్కెందుకు ఉన్న కటాఫ్ రు. 1000 కోట్లను చేరుకోలేకపోయారని ఈ నివేదిక వెల్లడించింది.
హురున్ ఇండియా రిచ్ 2019 ని 41 రకాల ఇండస్ట్రీ కి చెందిన 953 మంది సంపన్నుల సంపద వివరాలను సేకరించి తయారుచేశారు. కనీసం వేయి కోట్ల సంపద ఉంటే నే జాబితాలో కెక్కుతారు.
మొత్తంగా భారతదేశంలో సంపన్నుల సంఖ్య పెరుగుతూ ఉందని ఈ నివేదిక చెబుతున్నది. 2016తో పోలిస్తే డాలర్ బిలియనీర్ల సంఖ్య పెరిగింది 2 మాత్రమే అయితే, దేశీయ సంపన్నుల సంఖ్య గణీనీయంగా పెరిగింది. 2016లో 617 మంది వేయి కోట్ల అధిపతులుంటే ఇపుడు వీరి సంఖ్య 953కు చేరుకుంది.
ఇంతకీ అంత్యంత సంపన్నుడెవరు?
రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన ముఖేష్ అంబానీ (62) రు.3,80,700 కోట్లతో దేశంలోనే అత్యంత ధనవంతుడి హోదా దక్కించుకున్నారు. ఇది భారతీయ రిజర్వు బ్యాంక్ భారత ప్రభుత్వానికి చెల్లించే డివిడెండ్ కంటే 2.2 రెట్లు ఎక్కువ. ఇలా రిచెస్ట్ మ్యాన్ అఫ్ ఇండియాకు ఆయన ఎంపిక కావడం ఇది వరసగా ఏనిమిదో సారి.
అంబానీ రాబడి పెరిగుదల 3 శాతమే. అయితే, గౌతమ్ అదాని అండ్ ఫ్యామిలీ రాబడి లో 33 శాతం వృద్ధి ఉంది. ఇండియా లోని టాప్ రిచెస్ట్ వారిలో ఇది టాప్. ఇలా బాగా పెరుగుల ఉన్న సంపన్నుల జాబితాలో ఆజిమ్ ప్రేజ్ జీ (విప్రో), ఉదయ్ కొటక్ (కొటక్ మహేంద్ర), సైరస్ పూన్వాలా (సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా) ఉన్నారు.
ఇక సన్ ఫార్మా కు చెందిన దిలీప్ షాంగ్వి ల సంపద 20 శాతం పడిపోయింది.ఎర్సెలార్ మిట్టల్ కంపెనీకిచెందిన ఎల్ ఎన్ మిట్టల్ సంపద 10 శాతం పతనం చూపించింది.
953 మందిలో 246 మంది (26 శాతం) సంపన్నులు ముంబాయిలో ఉంటున్నారు. ఇక పట్టణాలో కు సంబంధించి ఢిల్లీలో 175 మంది, బెంగుళూరులో 77 మంది నివసిస్తున్నారు.