డాక్టర్ కృష్ణమూర్తి ఇకలేరు, రాయలసీమ ఉద్యమానికి తీరనిలోటు

డాక్టర్ కృష్ణమూర్తి అనంతపురము జిల్లాలోని శింగనమల మండలం, చామలూరు గ్రామంలో వెంకటలక్ష్మమ్మ, ఎరికలప్ప దంపతులకు 6 జూన్ 1961 లో జన్మించారు. మధ్య తరగతి కుటుంబంలోని వీరు కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో యం.బి.బి.యస్ పూర్తి చేసారు. స్త్రీలవ్యాధులపై డి.జి.ఓ కోర్సును చేసారు.
విద్యార్థి దశలో  విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడై  రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్.యస్.యు) లో కర్నూలు జిల్లా అధ్యక్షునిగా పని చేసారు.  కర్నూలు జిల్లాలో ప్రభుత్వ వైద్యులు గా వివిధ ప్రాంతాలలో ఉద్యోగం చేసారు.
ఎ.పి.సి.యల్.సి సభ్యులు గా అనేక ప్రజా ఉద్యమాలలో పాల్గొని క్రియాశీలకంగా పనిచేసారు.
2009 లో రాయలసీమ విద్యావంతుల వేదిక వ్యవస్థాపక కన్వీనర్‌గా రాయలసీమ నాలుగు జిల్లాలలో సీమ ఉద్యమ విస్తరణకు కృషిచేసారు.
కర్నూలు జిల్లా నుండి అనంతపురము జిల్లాకు బదీలీ పై వచ్చారు.   వైద్య శాఖలో జిల్లా కేంద్రంలోని టి.బి. సెంటర్ కో ఆర్డినేటర్ గా బాధ్యత చేపట్టాడు. ప్రస్తుతం శింగనమల పి.హెచ్.సిలో ప్రభుత్వ వైద్యులుగా కొనసాగారు.
గతకొంతకాలంగా రక్త సంబందిత వ్యాధితో బాధపడుతూ వేలూరులో చికిత్స పొందుతూ అదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
డాక్టర్‌ విశేషంగా సేవ చేస్తునే ,  గత దశాబ్దాకాలంగా రాయలసీమకు సంబంధించిన అన్ని ఉద్యమాలలోను క్షేత్ర స్థాయిలో పనిచేసారు. సాగునీటిఉద్యమం, వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజి, అనంతపురం లో ఎయిమ్స్, కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాపన వంటి వాటికోసం క్రియాశీలకంగా కార్యక్రమాలు చేసారు.
డాక్టర్ గా వ్యాదులు నయంచేయడమే కాకుండా, సామాజిక సమస్యలపై నిరంతరం సోషియల్ డాక్టర్ గా కూడా వీరు కొనసాగారు.
వీరి కుమారుడు బ్యాంకు మేనేజర్ గాను , కుమార్తె డాక్టర్ గాను కొనసాగుతున్నారు.
అనంతపురము లోని కళ్యాణదుర్గం రోడ్డులోని వైట్ ఫీల్డ్ గృహసముదాల వద్ద వీరి పార్థవ దేహం సందర్శకుల కోసం ఈ రోజు సోమవారం సాయంత్రం 4 గంటల దాకా ఉంచి, అనంతరం బళ్ళారి రోడ్డు లోని సిండికేట్ నగర్ ప్రాంతంలో అంతిమక్రియలు జరుగుతాయి.
డాక్టర్ కృష్ణ మూర్తి మరణానికి జిల్లాలోని పలు సంఘాలు సంతాపం ప్రకటించాయి.
రాయలసీమ విద్యావంతుల వేదిక- సభ్యులు రామాంజనేయులు, శ్రీనివాసులు , అరుణ్,
విరసం నాయకులు పాణి, నాగేశ్వరాచారి, శశికళ
ఏ.పి.సి.యల్ .సి నాయకులు – ప్రొఫెసర్ శేషయ్య,
జలసాధన సమితి – నాయకులు రాం కుమార్, రామకృష్ణ
రాయలసీమ సాగునీటి సాధన సమితి -నాయకులు బొజ్జా దశరథరామిరెడ్డి,
ఒ.పి.డి.ఆర్- నాయకులు శ్రీనివాసులు,
వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం- డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి,
రాయలసీమ యునైటెడ్‌ ఫోర్సు- నాయకులు నాగార్జున రెడ్డి, అశోక్ రెడ్డి,
రాయలసీమ విద్యార్థి సంఘం- నాయకులు సీమ‌కృష్ణ,
డెమోక్రటిక్ టీచర్స్ పేడరేషన్ – రత్నం ఏసేపు,
గురజాడ అధ్యయన కేంద్రం- దేశం శ్రీనివాసరెడ్డి, మల్లికార్జున,
రాయలసీమ విమోచన సమితి -నాయకులు రాజశేఖరరెడ్డి,
హంద్రీనీవా సాధన సమితి – నాయకులు  లోచర్ల విజయ భాస్కర రెడ్డి,
రాయలసీమ సాహిత్య సాంస్కృతిక సంఘం -నాయకులు ఈశ్వరయ్య, రవికుమార్, రాజశేఖరరెడ్డి,
తెలుగు బాష, సాంస్కృతిక సంఘం- డా. ఉద్దండం చంద్రశేఖర్ తదితరులు సంఘీభావం ప్రకటించారు.
-డాక్టర్ అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి