కేసీఆర్ అరాచక పాలన చేస్తున్నారు: సీపీఎం బృందాకారత్

నల్లగొండలోఎర్రజెండా అభ్యర్థిగా ఉన్న మల్లు లక్ష్మిని గెలిపించాలని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ప్రజలను కోరారు. నల్లగొండలో నీతి అవినీతికి మధ్య పోరు జరుగుతుందన్నారు. ప్రజలకు మంచి జరగాలంటే అది ఒక్క ఎర్రజెండాతోనే సాధ్యమన్నారు. నల్లగొండలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు.

మనిషి మనిషిగానైనా బతకగలుగుతున్నాడంటే దానికి కారణం ఎర్రజెండానేనని… ఎర్రజెండా లేకపోతే మనిషిని కూడా నిలువునా దోచుకునేవారని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజలను దోచుకునేవారిని కాకుండా, ప్రజలకు మంచి చేసే వారిని ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మల్లు లక్ష్మీ గెలిస్తే నల్లగొండ ప్రజలు గెలిచినట్టేనన్నారు. నల్లగొండ టిఆర్ఎస్ అభ్యర్ధి ఎంపీపీ కాలేకపోయాడని ఆయన ఎంపీ అయ్యి ఏం చేస్తారని ఆమె ప్రశ్నించారు. వ్యాపారాలు చేసేవారు రాజకీయాలు చేస్తారా, ప్రజలకు అందుబాటులో ఉండగలరా అని ఆమె నిలదీశారు. టిఆర్ఎస్ గెలిచినా ప్రజలకు లాభం ఉండదని, సీపీఎం గెలిస్తే ప్రజల పక్షాన నిలబడుతుందన్నారు.

బృందాకారత్ ఏమన్నారంటే…

“మోడీ అన్నింట్లో ఫెయిల్ అయ్యాడు కాబట్టే…. పాకిస్థాన్ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నాడు. కేసీఆర్ గత ఐదేళ్లలో మోడీ ప్రభుత్వానికి మద్దతుదారుడిగానే ఉన్నారు. ఈ ఎన్నికల తర్వాత కూడా కేసీఆర్ నుంచి అంతకు మించి  ఆశించాల్సిన అవసరం లేదు. బీజేపీ హఠావో…. దేశ్ కీ బచావో నే మా ఎన్నికల నినాదం.

గత ఐదేళ్ళలో రైతులను, కార్మికులను పట్టించుకోలేదు. ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగం పెరిగింది. బీజేపీ, ఆరెస్సెస్ లు దేశ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నాయి. మోడీ సర్కారుపై దేశ ప్రజలు అగ్రహాంతో ఉన్నారు. అన్నివర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

దేశంలో సెక్యూలర్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. కాంగ్రెస్ కు దేశ వ్యాప్తంగా ఒక నిర్ధిష్టమైన విధానం అంటూ లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రాజకీయ విధానం అనుసరిస్తుంది. తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలన చేస్తున్నారు. ప్రజలు ఈ ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ది చెప్పాలి.”  అని బృందా కారత్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *