(వార్త వెనక వార్త) రెండు మరాఠా కుటుంబాల కథ

శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్ సిపి, బాల్ ఠాక్రే ఏర్పాటుచేసిన శివసేన కలవడం పట్ల కొంతమంది విస్తుపోయారు.సిద్ధాంతాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.దేశం ఎటుపోతోందన్నారు.విలులేవీ? ప్రజాస్వామ్యం ఖూనీ అన్నారు.
సిద్ధాంతాల మీద చర్చ ఎక్కువగా చేసేది రాజకీయాలను దూరాన్నుంచి చూసే వాళ్లే, రాజకీయాలు చేసే వాళ్లు, రాజకీయాల్లో యాక్టివ్ గా  వాళ్లు కాదు.
రాజకీయాలు చూసే వాళ్లే రాజకీయానాయకులకంటే ఎక్కువగా ఆవేశపడుతుంటారు.రెచ్చిపోతుంటారు. తిట్టుకుంటుంటారు.కొట్టుకుంటుంటారు. వొంటి మీద పెట్రోల్ పోసుకుంటుంటారు.అరుస్తుంటారు. కేకలేస్తుంటారు. రాజకీయాల్లో ప్రేక్షకుల గోలే ఎక్కువ.
సోషల్ మీడియాలో వీళ్ల జనాభా చాలా ఎక్కువ. ఇలా రాజకీయ ప్రేక్షకుల్లో ఈ మధ్య ఇలాంటి ఆవేశాలను రేకెత్తించిన రాజకీయ పొత్తు ఎన్ సిపి, శివసేనది.
అయితే నిజానికి ఈ రెండు పార్టీలు రాజకీయ ప్రత్యర్థుల్లాగా చాలా కాలం పనిచేశాయి. అపుడు సహకరించుకునకున్నాయి. ఇపుడు దగ్గరయ్యాయి.
అయితే, రెండు పార్టీల కుటుంబాల మధ్య స్నేహం చాలా కాలంగా కొనసాగుతూ ఉంది. అది గాఢమయిన అనుబంధం. ఠాక్రే కుటుంటం, పవార్ కుటుంబాలు తొలినుంచి చాలా అన్యోన్యంగా వుంటూవస్తున్నాయి.కుటుంబాల మధ్య పొరపొచ్చాల్లేనే లేవు.
అవసరమయినపుడు బెస్టాఫ్ లక్  చెప్పుకుంటూ వస్తున్నాయి. దీనికి కింద ఇచ్చిన శరద్ పవార్ కూతురు లోక్ సభ ఎంపి సుప్రియా సూలే ట్వీట్ చక్కటి సాక్ష్యం. ఈ రోజు ఈ రెండుకుటుంబాల మధ్య ఉన్న స్నేహం గురించి టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఆసక్తికరమయిన కథనం రాసింది.
శరద్ పవార్ కి తొలినుంచి మరాఠా జాతీయ వాదం నచ్చకపోయినా,  యూత్ కాంగ్రెస్ లీడర్ గా ఉన్నప్పటి నుంచి ఠాక్రేతో అనుబంధం కొనసాగింది. సేన పెట్టక ముందే ఠాక్రేను పవార్ కలుసుకున్నారు. ఠాక్రే తండ్రి ప్రబోధాంకర్ ఒక పబ్లిక్ ఫిగర్. ఆయనకోసం పవర్ దాదర్ లో ఉన్న ఠాక్రే ఇంటికి వస్తూండేవాడు. అపుడు ఠాక్రే చాలా పదునైన కార్టూనిస్టు.అలా వారి మధ్య పరిచయం ఉంది.వ్యక్తిగతంగా పవార్ ను ఠాక్రే పవార్ బాబూ అని పలుస్తాడు. రాజకీయంగా పవార్ ను పిండి బస్తా(మైద్యాచా పోత) లా ఉన్నాడని గిల్లుకునేవాడు. పవార్ బొద్దుగా ఉండటంతో నిండు బస్తాలాగానే కనిపించేవాడు.
శివసేనపార్టీ ఎందుకేర్పడిందో తెలుసుగా?
ముంబాయి పరిశ్రమల పుట్ట. లెక్కలేనన్ని ఉద్యోగాలుండేవి. నిరుద్యోగులంతా ఎక్కడెక్కడి నుంచో వలసవచ్చి అక్కడ ఉపాధిచూసుకునే వాళ్లు. తెలంగాణవాళ్లు పెద్ద సంఖ్యలో ముంబైలో సెటిలయ్యేందుకు కారణం,అక్కడి ఉద్యోగాలే. ఈ ఉద్యోగాలతో ట్రేడ్ యూనియన్ యాక్టివిటీ బాగా పెరిగింది.  అందువల్ల ముంబై మీద పెత్తనం కోసం చాలా మంది ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే, ఇది కమ్యూనిస్టులకు బలంగా తయారయింది. వీళ్లని ఎదుర్కొనేందుకు ఒక వైపు నుంచి కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఉన్నా విజయవంతం కాలేకపోతున్నది. ఈ నేపథ్యంలో బాల్ ఠాక్రే కూడా  ముంబై మీద పట్టుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రాంతీయ వాదం మించిన ఆయుధం ఇంకేముంటుంది. మరాఠా హక్కు, మరాఠా ఉద్యోగాలు… ఇలా నినాదాలతో  1966 జూన్ 19న  బాల్ ఠాక్రే శివసేన ప్రారంభించి రాజకీయాల్లోకి వచ్చారు.
దీనితో పవార్ ఠాక్రేల రాజకీయ స్నేహం బ్రేక్ అయింది పైకి. వేర్వేరు పార్టీలలో వారు ప్రయాణాలు మొదలు పెట్టారు. అయితే, వారి కుటుంబాల మధ్య స్నేహం అలాగే కొనసాగింది. దీనిని ఇపుడు పునరుద్ధరించుకున్నారు. అందుకే ఉద్దవ్ ఠాక్రే సులభంగా ముఖ్యమంత్రి కాగలిగారు.
సుప్రియా సూలే చిన్నపుడొకసారి పుణేలో ఉన్న పవర్ కుటుంబ సమేతంగా ఠాక్రే ఇంటికి భోజనానికి వెళ్లారు. అక్కడ బాగా రాత్రయింది.చిన్నపిల్లతో రాత్రి ప్రయాణం వద్దు, ఇక్కడే గడిపి పొద్దేనే పుణే వెళ్లండని ఠాక్రే చెబితే పవార్ వినలేదు. కారు నడుపుకుంటూ వెళ్లిపోయాడు. పవర్ పుణే వెళ్లిపోయి, సురక్షితంగా చేరానని ఫోన్ చేసి చెప్పేవరకు బాల్ ఠాక్రే ఆందోళనతో నిద్రపోనేలేదట. బాల్ ఠాక్రే అనారోగ్యంతో ఉన్నపుడు ఉద్ధవ్ కు పవార్ ఎపుడూ ధైర్యం చెబుతూ ఉండేవారు.
2006 లో  శరద్ పవార్ కూతరు సుప్రియాలో సూలే ని రాజ్య సభకు నామినేట్ చేయాలనుకున్నారు.  ఈ వార్త ఠాక్రే కి ఎవరో చెప్పారు. ఈ ఠాక్రే ని చాలా బాధించింది. తనకు చెప్పకుండా సుప్రియా సూలేని ఎన్నికల్లో నిలబెట్టాలనుకోవడం ఏమిటని ఆయన పవార్ కు ఫోన్ చేసి నిరసన తెలిపారు. అంతేకాదు,సుప్రియాకు వ్యతిరేకంగా బిజెపి-సేన అభ్యర్థులను పెట్టరాదని ఠాక్రే బిజెపితో వాదించాడు. సుప్రియ చిన్నప్పటినుంచి నాకు తెలుసు. మాపిల్లలతో కలసి ఆడుకుంది. అలాంటి అమ్మాయి రాజ్య సభలోకి వెళ్తున్నపుడు నేను మద్దతు నీయాలి. కాబట్టి బిజెపి-సేన అభ్యర్థి వద్దని ఆయన వాదించారని టైమ్స్ రాసింది.
ఇపుడు సుప్రియా సూల ట్వీట్ కూడా ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని చెబుతుంది. ‘ అమ్మా, బాలసాహేబ్ గారు లేని లోటు ఈ రోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ రోజు మీరిద్దరు ఇక్కడ ఉండాల్సింది. వారిద్దరు కూతురికంటే ఎక్కువప్రేమాభిమానాలు నామీద చూపారు.నాజీవితంలో వారిపాత్ర ప్రత్యేకమయింది. సదా గుర్తుంచుకోవలసింది,’ అని సుప్రియా సూలే పేర్కొన్నారు.