చంద్రబాబుపై మరోసారి వైసీపీ అంబటి ఘాటు వ్యాఖ్యలు

వైయస్ఆర్సీపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విజయవాడలో బుధవారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు. పాయింట్స్ కింద ఉన్నాయి.
నిన్నసుప్రీంకోర్టులో చంద్రబాబు నాయకత్వంలో 21 పార్టీలు కలిసి వీవీ ప్యాట్ లపై వేసిన రివ్యూ పిటీషన్ తిరస్కరించిన తర్వాత మళ్ళీ ఈసీ దగ్గరకు వెళ్లి వీవీ ప్యాట్ లు లెక్కించండి అని చంద్రబాబు మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.
చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ కలిసి పోటీచేసిన సమయంలో కూడా ఈవీఎంలే కదా ఉన్నది. అది 40 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబుకు గుర్తు లేదా? సైకిల్ కి ఓటు వేస్తే ఫాన్ కి పడింది అని చంద్రబాబు అంటున్నారు. నా ఓటు ఎవరికి వేశానో నాకు తెలియదు అని మాట్లాడి.. వ్యవస్థలపై ఒక కుట్ర ప్రకారం అనుమానానాలను నింపుతున్నారు.
ఈవీఎంలు, వీవీ ప్యాట్ లపై దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసినప్పటికీ.. ఇంకా చంద్రబాబు ఆరోపణలు చేయడం ద్వారా.. వ్యవస్థను ఆవమానించేలా, అనుమానించేలా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు?
ఇందుకు చంద్రబాబు తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి..
చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలి. 40 ఏళ్ళ అనుభవం, అవకాశం వస్తే.. ఈ దేశంలో ప్రధాని కాగల అర్హత తనకే ఉందని మాట్లాడుతున్న చంద్రబాబు వ్యవస్థలపై గౌరవంతో వ్యవహరించాలి.
ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. క్యాబినెట్ సమావేశం పెట్టాల్సిన అవసరం, అత్యవసర పరిస్థితి ఏమొచ్చింది? అలాంటి అవసరం ఉంటే కచ్చితంగా పెట్టవచ్చు. కానీ చంద్రబాబు తన పంతానికి, అధికారులపై సవాళ్ళు విసిరి 10వ తేదీన కేబినెట్ పెడతానని విర్రవీగి.. చివరికి అధికారులు చెప్పినట్టే.. ఈసీ అనుమతి తీసుకునే వరకూ వేచి చూసే పరిస్థితి వచ్చింది. కేబినెట్ మీటింగ్ ను 14కు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. చంద్రబాబుకు కోడ్ నిబంధనలు తెలియవా?
ఇలా చంద్రబాబు ఎందుకు చేస్తున్నారంటే.. ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ టీడీపీకి వ్యతిరేకంగా వస్తున్నాయి, ఈ విషయం తెలిసే పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. పిల్లిమొగ్గలు వేస్తున్నారు.
చిన్న గాలి, వానకు అమరావతి టెంపరెరీ సచివాలయంలో స్మార్ట్ పోల్ విరిగిపోయిందంటే.. రాజధాని పనులు ఎంత నాసిరకంగా జరిగిందో.. ఎన్ని వందల కోట్లు కమిషన్లు గుంజుకున్నారో వేరే చెప్పక్కర్లేదు.
జస్టీస్ సిటీ కట్టానని ఆఖరికి ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షా పేపర్ లో కూడా ప్రశ్నలు వేయించి.. చివరకు చిన్న గాలి, వానకు టెంపరెరీ హైకోర్టులో గ్లాసు డోర్లు తునాతునకలయ్యాయి. ఇదేనా ప్రపంచ స్థాయి రాజధాని? ఇదేనా సింగపూర్ ను తలదన్నే రాజధాని?
చంద్రబాబు 5 ఏళ్ళ పాటు గ్రాఫిక్స్ చూపించి.. కట్టిన అమరావతి చిన్న గాలి, వానకు కుప్పకూలింది. ఇలా ఎందుకు జరిగిందో.. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. అమరావతి టెంపరెరీ నిర్మాణాల్లో అడుగడుగునా అవినీతి, కమీషన్లు. చంద్రబాబు పాలనకు అనర్హుడు.
రాజు వెడలె.. అన్నట్టు నిన్నచంద్రబాబు సుప్రీంకోర్టుకు హాజరవుతున్నారని హడావుడి చేసి.. చివరికి చంద్రబాబు కోర్టుకు వెళ్ళగానే తుస్సు మనడంతో.. ఏం మాట్లాడాలో అర్థం కాక.. మళ్ళీ సాయంత్రం ఈసీని కలిసి అదే ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు.. ఇప్పటి నుంచె కోర్టుకి వెళ్ళటం అలవాటు చేసుకుంటున్నారు. మంచిదే.. మున్ముందు ఆయన కోర్టుకే వెళ్లాల్సి వస్తుంది. ఇంతకుముందు కూడా ఏబీ వెంకటేశ్వరరావు, సీఎస్ విషయాల్లో ఈసీపై సవాళ్ళు విసిరి కోర్టుకు వెళ్ళి అభాసుపాలయ్యారు.
స్పీకర్ తన ఛాంబర్ లో ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాలు మాట్లాడటం అంటే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే. ఆయనపై ఈసీ తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
23వ తేదీ వరకు ఎలాగైనా అధికారం ఛలాయించాలి.. అన్న కుట్రలో భాగమే మంత్రి వర్గ సమావేశం డ్రామా తప్పితే మరొకటి కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *