ఓడినా టిడిపి పునాదులు కదల్లేదు, ఆ ఎంపిలకే జనాదరణ లేదు…

(యం. పురుషోత్తమ రెడ్డి)

నలుగురు టిడిపి రాజ్యసభ సభ్యులు తమను బీజేపీలో విలీనం చేయమని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు తమ సమ్మతి పత్రాన్ని నేతలు సమర్పించారు. పిరాయింపులను ప్రోత్సహించడమా ? అసలు బాబు ప్లాన్ లో భాగమేనా ? అన్న చర్చ జరుగుతోంది. ఈ ప్రశ్నలకు సమాధానం కాలం చెపుతుంది. కీలక విషయం టిడిపి నేతలను చేర్చుకోవడం ద్వారా బీజేపీ బలపడటం సాధ్యమా అన్నది….

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు…

రాజకీయ సమీకరణాలతో సంబంధం లేకుండా ఒక రాజకీయ పార్టీ బలపడటం లేదా బలహీన పడటం జరగని పని. బలప్రదర్శన , అధికార దర్పంతో ఏపార్టీ బలపడినట్లు చరిత్రలో కనపడదు.

ఏపీలో కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ పార్టీ స్థాపించడంతో వైసిపి , టిడిపి పార్టీల మధ్య ప్రజలు చీలి ఉన్నారు. మరో కొత్త పార్టీకి స్థానం దక్కాలంటే ఈ రెండు పార్టీలలో ఒకటి బలహీనపడాలి. టిడిపి ఓడిపోయినది. వైసిపి అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ దశలోకూడా టిడిపికి లభించిన ఓట్లు 40 శాతం. ఇంత వ్యతిరేక పరిస్థితిలో కూడా ఆపార్టీకి 40 శాతం ఓట్లు రావడం చిన్న విషయం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అనేక పరిణామాలలో టిడిపి డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి నుంచి ఏకంగా అధికారంలోకి వచ్చిన విషయం దాచినా దాగదు.

ఇదీ చదవండి: సూది మందు చూపు పోగొడితే, పట్టుదల సివిల్స్ కు చేర్చింది…

మరో వైపు అధికారంలోకి వచ్చిన జగన్ తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామం జగన్ పట్ల ప్రజలలో ఆదరణ పెరిగింది. అందుకే బాబు వైసిపి నుంచి ఎన్ని విమర్శలు వస్తున్నాకూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కారణం కొత్తగా అందులోనూ భారీమెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీపై రాజకీయ విమర్శలు చేయడం నష్టం అన్న అంచనాతోనే…..

గుణపాఠం నేర్చుకోని బిజెపి….

బిజెపి దేశంలో విజయం సాధించినా ఆపార్టీకి దక్షిణ భారత దేశంలో కర్ణాటక రాష్ట్రంలో మినహా మరో రాష్ట్రంలో స్థానం లేదు. కేరళలో బలపడాలన్న ప్రయత్నం సఫలం కాలేదు. తమిళనాడులో కేంద్రంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని బలపడాలని ప్రయత్నించి బలహీన పడింది. నేడు తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి ఆశలు పెరిగాయి కారణం అక్కడ కెసిఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత కాంగ్రెస్ బలహీన పడటం. ఈ పరిణామాలు చెపుతున్నది రాజకీయ సమీకరణాలు కలిసి రాకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని బలపడటం సాధ్యం కాకపోగా బలహీన పడే పరిస్థితి కూడా ఉత్పన్నమయ్యే అవకాశం లేక పోలేదు. కానీ అధికారం ఆపార్టీని అటువైపు ఆలోచించనియడం లేదు.

ఏపీలో భాజపా ఎదుగుదలకు అవకాశాలు అవరోధాలు…

ఏపీలో భాజపా ఎదుగుదలకు అవకాశాలతో బాటు అవరోధాలు కూడా బలంగానే ఉన్నాయి. విభజన కారణంగా కాంగ్రెస్ రాష్ట్రంలో బారిమూల్యాన్ని చెల్లించుకున్నది. అటు పిమ్మట అధికారంలోకి వచ్చిన బీజేపీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏనాడు ప్రయత్నం చేయలేదు. టిడిపి రాజకీయ చట్రంలో ఇరుక్కున్న బిజెపి ఏనాడు స్వతంత్రంగా రాజకీయాలు చేయలేదు. పలితం ఆపార్టీ చరిత్రలో ఎన్నడూ లభించని అతి తక్కువ ఓట్లను నమోదు చేసుకున్నది రాష్ట్రంలో. దేశంలో లభించిన విజయంతో ఈ వాస్తవాలు వారికి కనపడక పోవచ్చును. మళ్ళీ ఆపార్టీకి రాష్ట్రంలో బలపడడానికి అవకాశం ఉంది. కేంద్రం చేయాల్సిన సాయం నిజాయితీగా చేయడం అందులోనూ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కాదు కాబట్టి తన స్వతంత్రకు నష్టం రాదు. అధికార పార్టీ రాజకీయ తప్పిదం చేసి , టిడిపి సరైన పాత్ర పోషించని పరిస్థితి ఏర్పడినపుడు బిజెపికి రాష్ట్రంలో అవకాశాలు మెరుగు పడుతుంది. అంత ఓపిక , నిజాయితీ బిజెపి నాయకత్వానికి ఉండాలి.

టిడిపి నేతల చేరిక బిజెపి ఎదుగుదలకు ప్రతిబంధకం….

ఏపీలో జగన్ ప్రజాసానుకూల పరిస్థితి కారణంగా అధికారంలోకి వచ్చినారు. టిడిపి ప్రజా ఆగ్రహానికి గురైన పార్టీ. బిజెపి పార్టీతో జగన్ ఏనాడు రాజకీయ వైరాన్ని ప్రదర్శించలేదు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీమీద ఉన్న కోపంతో బిజెపి గెలవాలని జగన్ అబిమానులు కోరుకున్నారు. ఈ దశలో టిడిపి నేతలను చేర్చుకొని వెంటనే బలపడాలని అడుగుతు వేస్తే  బీజేపీ జగన్ మోహన్ రెడ్డిని అభిమానించే ప్రజల దృష్టిలో శత్రువుగా మారుతుంది. అలా మెజారిటీ ప్రజకు బిజెపి దూరం అవుతుంది. అలాని టిడిపి నేతలను చేర్చుకొంటే బలపడుతుందా అంటే అందుకు అవరోధాలు లేక పోలేదు.

1. టిడిపి ఓడిపోయిన పార్టీ కావచ్చు కానీ 40 శాతం ఓట్ల సాధించి , బలమైన పునాదులు కలిగి ఉన్న పార్టీ.

2. నేడు బీజేపీలో చేరిన వారికి ప్రజలలో ఆదరణ లేని వారు. అందులోనూ సృజన , రమేష్ లాంటి వారికి పైరవికారులన్న ముద్ర ఉన్నది.

పై రెండు కారణాలను పరిలిస్తే. టిడిపిలో నాయకత్వం బలహినపడింది. అన్న అంచనాకు వెంటనే రావడం తొందరపాటు అవుతుంది. ఒక వేల బలహీన పడినా టిడిపి నాయకులు చేరినంతగా ఆపార్టీ శ్రేణులు చేరరు. ఇంతకు మించిన సమస్యలను బాబు నాయకత్వంలో ఆపార్టీ అధిగమించిన విషయం తెలిసిందే. అందులోనూ బిజెపితో తీవ్రంగా విభేదించిన టిడిపి శ్రేణులు అదే పార్టీలోకి ఎందుకు వెలుతారు. నాయకులది ఆర్థిక సమస్యలు కానీ ప్రజలు , శ్రేణులవి రాజకీయ సమస్య. రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. పైపెచ్చు నేడు బీజేపీలో చేరిన సృజన , రమేష్ లకు వ్యతిరేకంగా ఆర్థిక అవకతవకలు జరిగాయని విచారణ చేపట్టారు. బీజేపీలో చేరారు కాబట్టి విచారణ నిలిచిపోతుంది. ఈ ఒక్క కారణం చాలు బిజెపి పట్ల ప్రజలలో వ్యతిరేకత రావడానికి. ఎలాగూ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావలసిన నిధుల విషయంలో లోపం , హోదా ఇవ్వని కారణంగా మరియు హుందాగా కేంద్రంతో ఉన్న జగన్ కు వ్యతిరేకంగా రాజకీయాలా అన్న వ్యతిరేకత ఒకవైపు ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులను చేర్చుకుని వారిపై విచారణలు నిలుపుదల చేస్తే సాదారణ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. టిడిపి నుంచి బీజేపీలోకి వెళ్ళిన వారు పైరవినేతలే తప్ప ప్రజానేతలు కాక పోవడంతో టిడిపి శ్రేణులు వెళ్ళరు. ఫలితంగా బిజెపి సమీప భవిష్యత్తులో బలపడడానికి ఉన్న అవకాశాలు టిడిపి నేతలను చేర్చుకుని అవరోధంగా మార్చుకోవడం మాత్రం బీజేపీ స్వయంకృపారాదం అనక తప్పదు…..

(యం. పురుషోత్తమ రెడ్డి,సమన్వయ కర్త,రాయలసీమ మేధావుల ఫోరం
తిరుపతి)

ఇది కూడా చదవండి
నిజాయితీకి శిలువ: నిష్కళంక IAS అధికారి టర్మినేషన్ కు యత్నం