శ్రీవారి నిధులతో ప్రభుత్వ బాండ్లను కొనాలనుకోవడం సంప్రదాయ విరుద్ధం: టిటిడికి భక్తుడి హెచ్చరిక

తిరుపతి వెంకన్న సొమ్మును దుర్వినియోగం చేసే ప్రయత్నం జరుగుతూ ఉందని, దీనిని వెంకన్న భక్తులు అడ్డుకోవాలని తిరుపతికి చెందిన భక్తి యాక్టి విస్టు నవీన్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి,తిరుమలలో జరిగే అనేక సంప్రదాయ వ్యతిరేక, అక్రమాలను ఎప్పటికప్పుడు నవీన్ కుమార్ రెడ్డి ప్రజల ముందు పెడుతుంటారు. ఈ సారి వడ్డీ డబ్బుల కోసం శ్రీవారి నిధులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాండ్లను కొనుగోలు చేయించే ప్రయత్నం జరుగుతున్నదని ఆయన  చెబుతున్నారు.  శ్రీవారి సొమ్ముతో   కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోకు పడాలనుకోవడమేమిటని ఆయన విమర్శిస్తున్నారు. శ్రీవారి సొమ్మును ఇలా దారి మళ్లిస్తే తాను కోర్టు కెళతానని ఆయన హెచ్చరిస్తున్నారు.తిరుమలలో ఏం జరుగుతున్నదో  నవీన్ మాటల్లోనే వినండి… 

* కరోనా లాక్ డౌన్ సమయంలో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో  నిధుల మళ్లింపు తీర్మానం చేశారు!
“TTD board resolution No 140” dated 28-08-2020
Approved to invest in Central government (OR) State government securities, so as to avail the “interest” advantage. TTD rule 80 of G.O Ms No 311,dt 9-4-1990 & TTD finance committee meeting on13-08-2020.
వెంకన్న “సొమ్ముతో” కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు “సోకులు పడాలనుకుంటున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక సంస్థ అలాంటిది ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చకండి!
శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు పరమ పవిత్రం వాటి జోలికి వెళ్ళకండి టిటిడి తీసుకున్న ప్రభుత్వ బాండ్ల కొనుగోలు పై “మఠాధిపతులు పీఠాధిపతులు” ప్రశ్నించాలి!
టిటిడి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ ధర్మకర్తల మండలికి ఏ ఐఏఎస్ అధికారులకు రాని దుర్మార్గపు ఆలోచనలు అనాలోచిత నిర్ణయాలు నేటి ధర్మకర్తల మండలికి ఐఏఎస్ అధికారులకు ఎందుకు వస్తున్నాయి!
 శ్రీవారి నిధులు ఇప్పటివరకు నేషనలైస్డ్ బ్యాంకులలో భద్రత దృశ్య వడ్డీ కొంత తక్కువ ఉన్నా డిపాజిట్లు చేసి ఆయా బ్యాంకుల ద్వారా వచ్చే నిధులతో పరోక్షంగా “లడ్డూ కౌంటర్లలో” “పరకామణిలో” సిబ్బందిని నియమించుకుని వారికి బ్యాంకు ద్వారా జీతాలు ఇపిస్తూ టీటీడీ పై ఆర్థిక భారం పడకుండా చేస్తున్నారు!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులలో డిపాజిట్ల పై వడ్డీ రేటు తగ్గించిందనే పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బాండ్లను టీటీడీ కొనుగోలు చేసే ఆలోచన చేస్తున్నారు. దీనిని విరమించుకోవాలి.  తగ్గిన వడ్డీ రేటుకు సమానంగా  టిటిడి పై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ఆలోచనలపై ధర్మకర్తల మండలి ఐఏఎస్ అధికారులు దృష్టి సారించాలి!
 టిటిడి ధర్మకర్తల మండలి అధికారుల తీరు చూస్తుంటే అధిక వడ్డీ కోసం శ్రీవారి నిధులను “రియల్ ఎస్టేట్” “షేర్ మార్కెట్” లలో కూడా పెడతారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి!
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మెప్పుకోసం మీ కుర్చీలను కాపాడుకునేందుకు శ్రీవారి సొమ్ముని ఫణంగా పెడితే శ్రీవారి భక్తునిగా హైకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరిస్తున్నా!